Tuesday, June 17, 2025
HomePOLITICSఉత్తరాంధ్ర ఆచార్యులు వీసీ లుగా పనికిరారా?

ఉత్తరాంధ్ర ఆచార్యులు వీసీ లుగా పనికిరారా?

ఉత్తరాంధ్ర జిల్లాల విశ్వవిద్యాలయాలకు ఉత్తరాంధ్ర  ఆచార్యులనే వైస్ – ఛాన్సలర్  లుగా నియమించాలని ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుంకరి రమణమూర్తి కోరారు.  గుర్ల మండలంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి కె శ్రీనివాస్ కి మాజీ మంత్రి చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావుకి, ఎస్.కోట శాసనసభ్యులు కోళ్ళ లలిత కుమారికి ఉత్తరాంధ్ర విద్యార్థి సేన తరఫున వినతిపత్రం అందజేశారు.  డాక్టర్ సుంకరి రమణమూర్తి సమస్యను విపరిస్తూ, ఉత్తరాంధ్ర ప్రాంతం దేశంలోనే అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, ముఖ్యంగా విద్యారంగంలో మరింత వెనుకబడి ఉందని తెలియజేస్తూ, ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం, జేఎన్టీయూ గురజాడ విజయనగరం, అంబేద్కర్ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం, త్రిబుల్ ఐటీ శ్రీకాకుళం వంటి విశ్వవిద్యాలయాలు పరిపాలన విషయాల్లో ఉత్తరాంధ్రేతరులకు పెద్దపీట వేయడం వల్ల ఉన్నత విద్య ఉత్తరాంధ్ర విద్యార్థులకు అందని ద్రాక్షగానే మారిందని, దీనికి ప్రధాన కారణం గత 100 సంవత్సరాలుగా పైన పేర్కొన్న విశ్వవిద్యాలయాలను ఉత్తరాంధ్రేతర ఆచార్యులు వీసీ లుగా పరిపాలించడమేనని పేర్కొంటూ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అర్హులైన ఆచార్యులను వైస్ ఛాన్సలర్ లుగా నియమిస్తే , ఈ ప్రాంత విద్యార్థులకు ఇటు అడ్మిషన్ల లోను అటు నియామకాల లోనూ న్యాయం జరుగుతుందని , అదేవిధంగా ఈ  ప్రాంతం విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని  ఈ ప్రాంతంలో అర్హులైన ఆచార్యులకు కొదువ లేదని, దేశంలోనే పేరెన్నిగన్న మేధావులు చాలామంది ఈ ప్రాంతం నుంచి వెళ్లిన వారేనని గుర్తు చేశారు.
1926లో ఏర్పడిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 100 సంవత్సరాలు కాలంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కేవలం ముగ్గురు ఆచార్యులు మాత్రమే వైస్-ఛాన్సలర్ లుగా పనిచేయడం వలన, 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కేవలం 9 సంవత్సరాలు మాత్రమే ఉత్తరాంధ్ర ఆచార్యులు వీసీ లుగా పనిచేయడం, మిగతా 91 సంవత్సరాలు ఉత్తరాంధ్రేతర ఆచార్యులు వీసీ లుగా పని చేయడం వలన ఉత్తరాంధ్ర జిల్లాలకు అటు అడ్మిషన్లలోను ఇటు నియామకాలలోనూ తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు.
ఉదాహరణకు 2008లో ఎక్స్టెన్షన్ సెంటర్ గా ఏర్పడి, 2022లో విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందిన విజయనగరం జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయాన్ని తీసుకుంటే ఇందులో 95% టీచింగ్ స్టాఫ్ ఉత్తరాంధ్రేతరులే.
2022లో అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కేవలం తన స్వార్థం కోసం అవసరమైనప్పుడు “జై ఉత్తరాంధ్ర” నినాదాన్ని వాడుకుంటూ, మన ప్రాంత ప్రయోజనాలను కాపాడేటప్పుడు మాత్రం రాయలసీమ వాళ్లను, గుంటూరు, ప్రకాశం, కృష్ణ, నెల్లూరు జిల్లాల వాళ్లను అందలమెక్కిస్తారని. ఇందులో భాగంగానే బొత్స హయంలో జరిగిన జేఎన్టీయూ గురజాడ విజయనగరం వైట్ ఛాన్సలర్ నియామకం. ఆ మధ్య కాలంలో బొత్స ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలకు చెందిన ఆచార్య వెంకటసుబ్బయ్యను తన ఇష్టపూర్వకంగానే వైస్-చాన్సలర్ గా నియమించుకున్నారని తెలియజేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తు మీడియా సమావేశంలో అతనే ఒప్పుకున్నారని, బొత్స నియమించిన వైస్ ఛాన్సలర్ ఆచార్య వెంకటసుబ్బయ్య వలన జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం విద్య ఉపాధి సూచిక లో పదేళ్లు వెనక్కి వెళ్ళిపోయిందని, మనందరికీ తెలిసిందే. అనేక ఆరోపణలతో పాటు విశ్వవిద్యాలయ పురోభివృద్ధి లేకపోవడం మనం చూస్తున్నామని తెలిపారు.
ఉత్తరాంధ్రేతర వైస్ ఛాన్సలర్ల వలన ఉత్తరాంధ్ర ఉన్నత విద్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని స్పష్టం చేస్తూ భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉత్తరాంధ్ర జిల్లాల విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లు గా, ఉత్తరాంధ్ర జిల్లాల ఆచార్యులనే నియమించాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యలను విన్న మంత్రి మరియు శాసనసభ్యులు స్పందిస్తూ, ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చి తప్పకుండా ఉత్తరాంధ్ర విద్యార్థులకు న్యాయం చేస్తామని, ఉత్తరాంధ్ర ఆచార్యులనే ఉత్తరాంధ్ర విశ్వవిద్యాలయాలకు వీసీ లుగా నియమించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రావాడ సీతారాం,ఉత్తరాంధ్ర విద్యార్థి సేన ఏయూ ఇంచార్జ్ కంటంరెడ్డి సూర్యనారాయణ, పలువురు విద్యార్థులు, తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments