అసైన్డ్ భూముల సవర చట్టాన్ని రద్దు చేయాలని, పోడు పారెస్టు భూములకు పట్టాలు ఇవ్వాలని, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని, గతంలో పట్టాలు ఇచ్చిన అసైన్డ్ భూములను వెంటనే ఆన్లైన్ చేయాలని వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. వెంకన్న డిమాండ్ చేశారు. గురువారం అయిన ఒక ప్రకటన విడుదల చేస్తూ, రాష్ట్రంలో అన్యాక్రాంతమైన దళిత, గిరిజన, బలహీనవర్గాలకు చెందిన 13 లక్షల ఎకరాల భూములు తిరిగి వారికే దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన భూ రీ-సర్వే వలన సమస్యలు చాలా తీవ్రత కలిగి ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ప్రజాసంఘాల పోరాటాల ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 58 లక్షల ఎకరాల భూములను దళిత, గిరిజన, బలహీన వర్గాలు వారికి పంపిణీ చేయగా, వీటిలో 13 లక్షల ఎకరాల భూములను చట్టాల్లోని లోపాలను అడ్డు పెట్టుకోని పెద్దలు కబ్జా చేశారన్నారు. 1977లో తీసు కొచ్చిన అసైన్డ్ చట్టానికి గత ప్రభుత్వం సవరణలు చేసి, ధరలు అధికంగా ఉన్న చుక్కల భూములను ఫ్రీ హోల్డ్ చేసి పెద్ద ఎత్తున పేదల భూములను పెద్దలకు కట్ట బెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు .ఈ సవరణలు రద్దు చేసి అన్యాక్రాంతమైన భూములను తిరిగి పేదలకే అందిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇప్పుడు తూతూ మంత్రంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. కోనేరు రంగారావు కమిటీ ఈ రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారని, ఆ దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చి, భూములు చూపించని వారికి వెంటనే స్థలాలు చూపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం భూములను ఏ విధంగానైనా భూములను తన చేతిలోకి తీసుకోవాలనే దుర్బుద్ధితో ఉందని తెలిపారు. ఫ్రీహోల్డ్ భూములకు మార్కెట్ విలువకు రెండున్నర రెట్లు ఫీజు చెల్లిస్తే హక్కులు కల్పిస్తామనడాన్ని తప్పు బట్టారు. పేదలకు సెంటు స్థలం ఇవ్వలేని ఈ ప్రభుత్వాలు వ్యవసాయ భూములు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గత కొంతకాలంగా దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రస్తుత పార్టీలు పేదలకు మేలు చేస్తాయంటే అది భ్రమే అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలు, చీకటి గదుల్లో బందించబడి ఉన్నాయన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో కొత్త భూ రికార్డులు ప్రజలకు అందుబాటులో ఉంచడం, జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ఉన్న చేతిరాత 1బి రికార్డులను,అన్ని మండల తహశీల్దారు కార్యాలయాల్లో అందుబాటులో ఉంచడం, ఇప్పటి వరకు అన్యాక్రాంతమైన భూమి ఎంత గుర్తించారు!. ఎంత మంది పేదలకు తిరిగి వాటిని అప్పగించారనే విషయాలు కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ఇంటి స్థలం లేని వారందరికీ మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని పంపిణీ చేయడం, ప్రతి పేద దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమిని ఇవ్వాలని, అసైన్డ్ భూములు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని వెంకన్న డిమాండ్ చేశారు.
అసైన్డ్ భూముల సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
0
34
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -