Tuesday, June 17, 2025
HomeBHAKTIశ్రీ శ్రీనివాసా... ఉన్నావా?

శ్రీ శ్రీనివాసా… ఉన్నావా?

వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించనా

వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి:

శ్రీ శ్రీనివాసుడు నిలయమైన వేంకటాద్రి వంటి కొండ, ఆ కొండపైన వెలసినట్టి శ్రీవేంకటేశ్వరస్వామి వంటి భగవంతుడు ఈ బ్రహ్మాండంలో ఇంతకు ముందులేవు ఇకపై రావు. శ్రీనివాసుడు నివాసమయినటువంటి ఆ వేంకటాద్రికొండ భూలోకంలో వైకుంఠం, అలాంటి వైకుంఠం ఎప్పుడూ సంచలనాలకు దారి తీస్తూనే ఉంటుంది. ఆయన మహిమలు కూడా అంత ప్రభావాన్ని ఈ విశ్వంపై చూపుతాయి.నమ్మిన వారికి కొంగుబంగారం,శరణం అంటే చాలు అభయహస్తం ఆదుకునే కోనేటి రాయుడు వాడు కుల, మత, రహిత,పేద ,ధనిక,బాష,,అధికార,అనధికార రహిత హరిత కొండ ఆ తిరుమల కొండ. ఆయన దగ్గర భక్తి ఒకటే కొలమానం! ఆయన దేవుడు ఆయనను భక్తితో కొలిచే భక్తులు అంతే! అంతకన్నా తార తమ్యాలు లేవు. ఎంతగా ఆరాధిస్తే అంతగా భక్తులను కాపాడే లక్ష్మీపతి ఆ శ్రీనివాసుడు. రాజులు ఇచ్చే అహంకార వజ్ర వైడుర్యాల కానుకలను తిరస్కరించి, ఆయన భక్తుడైన కుమ్మరి దాసు కోరిక మేరకు మట్టి పూల పూజను స్వీకరించి, మట్టి ప్రమిదలో గంజి, ఉల్లితో కూడిన అన్నాన్ని నైవేద్యంగా నేటికీ స్వీకరిస్తోన్న ఆ కాశీ అన్నపూర్ణ సహోదరుడు శ్రీశ్రీ తిరుమల వేంకటేశ్వరుడు.
ధర్మో రక్షతి, రక్షితః
నీవు ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే నిన్ను రక్షిస్తుందని ప్రత్యక్ష అర్థం. ధర్మాన్ని నాశనం చేస్తే ధర్మమే శిక్షిస్తుందని కూడా పరోక్ష అర్థం. ధర్మమేదో అధర్మమేధో ఎరుకులనాంచారి అవతారి శ్రీ వేంకటేశ్వరకేస్వామికి ఎరుక. కారణం ఏది ధర్మమో ఏది అధర్మమో గ్రహించలేని స్థితికి చేరిపోయాడు మనిషి. చేస్తోన్న పని, ఆచరిస్తోన్న విధానం,నోటి మాట కూడా అధర్మమే అని తెలిసినా, భగవంతుడు శిక్షిస్తాడు అని తెలిసినా నేటి మనిషికి భయం, బెదురూ లేకుండా పోతోంది. అనాధ రక్షకుడయిన ఆ ఆదినారాయణుడు యొక్క ధర్మ సందేశం తెలిసినా నిస్సుగ్గుగా చేయకూడని పనికి,పలుకకూడని పలుకులు పలకడానికి వెనుకాడటం లేదు. అధర్మవాదులకు,అపచారకులకు వేసిన శిక్షలు కళ్లెదుట కనబడుతున్న అహంకార అలంకారం చేసుకొని రాక్షస తత్వానికి అలవాటు పడి స్వామివారి నామం జపిస్తూ అడ్డగోలు చర్యలు చేపడుతూ ఆయన భక్తులకు మానసిక క్షోభకు గురిచేస్తున్నారు నేటి పాలకులు.సామాన్య భక్తుడు నుండి అసామాన్య కుబేరులవంటి భక్తులుకూడా స్వామి వారు అంటే భయంతో పాటు భక్తిని కనబర్చి ఆయన ఆశీస్సులు పొందుతారు. చేయకూడని పనులు చేస్తే స్వామివారు కఠినంగా శిక్షిస్తారని కూడా తెలుసు. అయినా కూడా ఆయనంటే విశ్వాసం ఉంది అని చెపుతూ వాళ్ళ ప్రవర్తనా శైలి మాత్రం విరుద్ధంగా ఉంటుంది. చేయరాని అధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. దౌర్జన్యంగా అక్రమార్జనతో సంపాదించిన సొమ్ముతో కానుకలు ఇవ్వాలని చూస్తారు. కానీ ఇటువంటి చౌకబారు భక్తి స్వామీ వారి దగ్గర చెల్లదు. ఆయన పేరు చెప్పి రకరకాల వికృత చర్యలకు పాల్పడతారు. అలానే శిక్షలు కూడా అనుభవిస్తారు.వెనుకటి ఒక రాజకీయ నాయకుడు ఏడుకొండలమీద చర్చి నిర్మిస్తారని చెప్పి పుంఖాను పుంఖాలుగా కథనాలు నడిచాయి. చర్చి నిర్మాణ కార్యక్రమం అవునో కాదో స్వామి వారికే తెలియాలి. కానీ ఆ రాజకీయ నాయకుడు అనుకోకుండా అకస్మాత్తుగా నీరు, నిప్పు కలిపిన వానలో హెలికాఫ్టర్ లో ప్రయాణం చేస్తూ ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. ముఖ్యమంత్రి హోదాలో చనిపోయిన రాజశేఖర రెడ్డికి తగిన శాస్తి జరిగిందని అనుకున్నారు.స్వామి వారితో పెట్టుకున్నవాడు బతికి బట్ట కట్టడు అంటారు.దానికి ఉదాహరణగా రాజశేఖర రెడ్డి మరణం అని చెప్తారు నేటికీ. స్వామివారితో ఆటలాడితే ఆలా శిక్షలు వేస్తారని తెలిసి గొప్ప గొప్ప హోదాల్లో ఉండి కూడా పరిపాలకులు ఎందుకో ఆయనతో కయ్యానికి కాలు దువ్వుతుoటారు. ఏమి చేస్తాడులే అననే అహంకారామమో?లేక ఆయన లేడని భావమా? లేక ఆయనంటే చులకన భావమా? కారణాలు ఏమైనా కావచ్చు. ధర్మానికి నిలువెత్తు రూపమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అది ఆయనను కొలిచే వారికి ప్రగాఢ విశ్వాసం. పావురాల గుట్ట మీద జరిగిన ప్రమాదం స్వామి వారి మహిమ అయితే రాజశేఖరరెడ్డి అధర్మానికి పాల్పడినట్లే. అలాంటి సంఘటనలు గుర్తు పెట్టుకొని అయినా నేడు పరిపాలిస్తోన్న ప్రభుత్వంలో పెద్దలు నోరు జారకూడదు కదా? అయినా నోటికి వచ్చినట్లు వాగితే స్వామివారి మీద భయం, భక్తి లేనట్లే కదా! తిరుమలను రాజకీయం కోసం, వారి ఎదుగుదల కోసం ఇష్టానుసారం అప్రదిష్టపాలు చేస్తున్నట్లే కదా! ప్రభుత్వం ఏర్పాటు కాగానే తిరుమల దేవస్థానాన్ని ప్రక్షాళన చేస్తానని వాగ్ధానం చేసి మరీ పీఠంఫై కూర్చుంది కూటమి ప్రభుత్వం! గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రక్షాళన చేసి భక్తుల ముందు నిల్చోబెట్టి చట్ట రీత్యా శిక్షలు అమలుకు చొరవ చూపాలి. కదా. `పార్టీ సమావేశంలో పవిత్రమైన స్వామివారి లడ్డు ప్రసాదంలో ఆవునెయ్యికి బదులు జంతువుల క్రొవ్వు కలిసింది. దీనికి కారణం గత ప్రభుత్వం చేసిన అరాచకం.హిందూ సమాజం తలదించుకునేలా స్వామి వారి దేవాలయ పవిత్రతను నాశనం చేసేలా గత ప్రభుత్వం పాలకమండలి వ్యవహరించిందని బహిరంగంగా ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు.తానా తందానా అన్నట్లుగా ఉప ముఖ్యమంత్రి సనాతనవాది పవన్కళ్యాణ్ శ్రీరాముల వారి ప్రతిష్ట మహోత్సవానికి కూడా కొవ్వు కలిపిన లడ్లు పంపారని ప్రకటించి ప్రాయచిత్త దీక్షపూని ఎఱ్ఱరంగు వస్త్రం ధరించి దుర్గమ్మ గుడి మెట్లదారి సిద్ధం చేసేసారు వినకూడని దుర్వార్త విన్న భారతదేశం మొత్తం ఆశ్చర్యానికి గురైంది. ప్రపంచం వ్యాప్తంగా హిందువులు మరీ ముఖ్యంగా స్వామీ వారిని ప్రాణంతో సమానంగా ఆరాధించేభక్తుల మనోభావాలు గాయపడ్డాయి. దేశం మొత్తం ఈ ప్రకటనను విని ఆశ్చర్యానికి గురయింది. ఈ ప్రకటన పూర్తిగా రాజకీయ లబ్ది కోసమో, ప్రతిపక్ష పార్టీలను భ్రష్టు పట్టించే ప్రక్రియ మాత్రమేననిపిస్తోందని ఉవ్వెత్తున హిందూ సంఘాలు రోడ్డుమీదకు వచ్చాయి. ఉద్యమాలు చేసాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు చంద్రబాబును ఏకి పారేశాయి. ఇది సత్య దూరమైన ప్రకటన అని చంద్రబాబు నిజాలు తెలుసుకోకుండా ప్రకటన చేసి దేవాలయ ప్రతిష్టకు భంగం కలిగించారని విశ్వ హిందుపరిషత్ లాంటి సంస్థలు చంద్రబాబును క్షమాపణ కోరాయి – విచారణ జరగాలని డిమాండు చేశాయి. హిందువులు అత్యంత పవిత్రమైన రోజుగా భావించే వైకుంఠ ఏకాదశి నాడు దర్శన భాగ్యం కోసం తిరుమలకు చేరుకున్న అశేష భక్త జనకోటికి సరైన ఏర్పాట్లు చేయడంలో కూడా దేవస్థాన పరిపాలనా సిబ్బంది నిర్లక్ష్యం వహించిన కారణంగా సుమారు అయిదుమంది భక్తులు మరణించి, నలభై మందికి పైగా భక్తులు అస్వస్థతకు గురయ్యారు. స్వామివారి కృప వలన బ్రతికి బట్ట కట్టారు. ఇంతటి ఘోరాతి ఘోరం జరిగితే ఎలాంటి చర్యలు చేపట్టలేదు దేవస్థానం గాని, ప్రభుత్వం గాని, లడ్డు ప్రసాదంలో జంతువుల క్రొవ్వు కలిపారో లేదో నిర్ధారణ జరగకుండానే మహా సంప్రోక్షణ చేపట్టారు. అలాంటిది భక్తుల ప్రాణాలు తృణప్రాయంలో గాలిలో కలిసిపోతే ఎలాంటి దోషం రాధా? దేవాలయ సంప్రోక్షణ చేయరా? అని హిందూవాదులు ప్రశ్నిస్తున్నారు.ఇంతటి దారుణాలు తిరుమలలో జరిగాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రకటనలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ప్రకటనలు, చేష్టలు తప్పని గాని ఒప్పునిగాని ఒక ప్రవచన కర్త కూడా స్పందించలేదు. స్వామి వారి పేరు చెప్పుకొని పబ్బం గడిపే ఈ ప్రవచన కర్తల భక్తి ఏమయిపోయింది? భక్తుల మనోభావాలను దెబ్బతినకుండా సంతృప్తిపర్చేలా కుహనా ప్రవచన కర్తలు బాధ్యత తీసుకొని దేవాలయంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదనో జరిగాయనో ప్రవచనాల్లో ప్రసంగించాలి కదా! లేదా తప్పు జరిగిందంటే వారిపై కఠినమైన శిక్షలు తీసుకోవాలని ప్రకటనలు చేయాలి కదా!ఏది అపచారం :జగన్మోహన రెడ్డి ప్రభుత్వంలో నియమించబడ్డ తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన పరిపాలనా అధికారి ధర్మారెడ్డి కుమారుడు అకస్మాత్తుగా మృతి చెందాడు. అనంతరం వచ్చిన శ్రీవారి బ్రహ్మోత్సవాలలో బాధ్యతలను నిర్వహించాడు ధర్మారెడ్డి. పవిత్రమైన బ్రహ్మోత్సవాలలో ధర్మారెడ్డి మైలుతో పాల్గొన్నాడు. ఇది పెద్ద అపచారమని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. మైలు ఉన్నవారు సంవత్సరం పాటు ఉత్సవాలలో పాల్గొనరాదు. ఇది నియమం. అని ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా ప్రశ్నించారు.కానీ నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు చనిపోయిన మూడు మాసాలకే సీఎం హోదాలో తన మనుమడి పుట్టిన రోజు సందర్బంగా దేవాలయంలో ప్రవేశించి అన్న ప్రసాదాలు స్వీకరించారు చంద్రబాబు,అయన కుటుంబం. దేవుని గడప అందరికీ సమానమే.అయితే అప్పటి ఈవో చేసింది అపచారమయితే నేడు చంద్రబాబు కూడా సీఎం హోదాలో చేసింది కూడా అపచారమయితే నేడు చంద్రబాబు కూడా సీఎం హోదాలో చేసింది కూడా అపచారామె కదా మరి? దీనిని ఎవరు ప్రశ్నించలేదు అంటే ధర్మారెడ్డి చేసింది తప్పుకాదని అర్థమేకదా? అంటే రాజకీయ లబ్ది కోసం హిందువుల మనోభావాలు దెబ్బ తీయడమే కదా? రాజీకీయానికి దేవుడిని బహిరంగపర్చడం అంటే ధర్మానికి తూట్లు పోడిచినట్లే అనే భావన వస్తుంది. మాకు తిరుమల దేవస్థానములో మర్యాదలు లోపించాయని గగ్గోలు పెట్టె పీఠాధిపతులు, స్వాములు కూడా పూర్తిగా మౌనం పాటించారు. స్వామీ వారి నుండి మర్యాద, మన్ననలు ఆశించే స్వాములు, ఆయన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లినప్పుడు బహిరంగంగా ఖండించాలి కదా! అలాంటివేమీ చేయలేదు సరికదా మౌనవ్రతం కూడా పాటించారు. అంటే స్వాములకు శ్రీ శ్రీనివాసుడిపై ఉన్నటువంటి భక్తి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. నిందను వేసింది ప్రభుత్వ పెద్దలు. పాపం, పుణ్యం శ్రీ శ్రీనివాసుడికి వదిలేస్తే సరి అని మూసుకొని కూర్చున్నారు స్వాములు.భోగాలు మాత్రం అనుభవిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడిగా వేడిగా సాగాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అన్యాయాలు, అపచారాలు, భవిష్యత్తు ఇల్లాంటి అపచారాలు జరుగకుండా చూసుకునేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చ జరుగుతుందేమోనని ప్రజలు, శ్రీనివాసుని భక్తులు ఆశించారు. కానీ ఎలాంటి చర్చ జరగలేదు సరికదా ఆయన పేరు ఉచ్ఛరించడానికి కూడా ప్రభుత్వ పెద్దలు ,ప్రతిపక్ష పార్టీల పెద్దలు కూడా ఇష్టపడలేదు. హిందూయిజం అంటే మేమేనని జబ్బలుచరుచుకొని గావుకేకలు పెట్టి ఆరుస్తోన్న బీజేపీ శాసన సభ్యులు కూడా ఒక్క మాటకూడా స్వామివారి కీర్తి ప్రతిష్టల భంగపాటు గురించి నోరెత్తలేదు. భూమి పుట్టిన నాటినుండి సనాతన ధర్మం దేదీప్యమానంగా వర్ధిల్లుతోంది. అలాంటి సనాతన ధర్మాన్ని అవసరం లేకపోయినా భుజాన వేసుకొని ఊరేగిన పవన్ కళ్యాణ్ కూడా నోటిలో నాలుకలేని వాడైనాడు. అసెంబ్లీలో తగిన బలం లేక వైసీపీకి శ్రీ శ్రీనివాసుడు గురించి అడిగే అవకాశం లేకుండా పోయింది. శాసన మండలిలో కూడా అదే తంతు. ఇది రాజకీయ నాయకులకు పరిపాలకులకు శ్రీ శ్రీనివాసుడిపై ఉన్న కపట ప్రేమ,భక్తి. అందరూ స్వామివారి పేరు ప్రతిష్టలను వారి వారి స్వార్ధం కోసం అవసరమయినప్పుడు అనుకూలంగా వాడుకొని బజారున పడేయడమే తప్పా, ఆయన కీర్తి ప్రతిష్టలు గురించి పట్టించుకునే రాజకీయరంగ భక్తుడు, ప్రవచనకర్త, స్వామి ఒక్కడు కూడా లేడు… ఇదే సత్యం. కలియుగంలో మానవ జాతిని,సువిశాల విశ్వాన్ని ఉద్దరించడానికి సాక్షాత్తు హరిహరుడే శ్రీవెంకటేశ్వరునిగా తిరుమల కొండపై వెలసిన శ్రీ మహావిష్ణువు మనం కొలిచే శ్రీ శ్రీనివాసుడు. ఆయన భక్తులపాలిట కొంగు బంగారం, అనాథలను రక్షించే ఆపద్భాంధవుడు ఆ కలియుగ శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఇలాంటి నీచ నికృష్ట రాజకీయ నాయకుల వ్యర్ధ ప్రేలాపనలు ఏవి కూడా ఆయన కీర్తి, ప్రతిష్టలను దెబ్బ తీయలేవు సరికదా నడుస్తోన్న కాలగమనంలో చరిత్ర హీనులుగా మిగులుతారు.
ధర్మో రక్షతి …. రక్షితః
నమో వెంకటేశాయ నమః

మధు బోజంకి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments