మధురవాడ,జయ జయహే న్యూస్: కళాశాల రోజులలో తమ పూర్తి సమయాన్ని చదువులపై దృష్టి పెట్టి తమ అభివృద్ధికి,నూతన ఆవిష్కరణలకు యువత వినియోగించాలని కేంద్ర పౌర విమాన శాఖా మంత్రి కింజారాపు రామ్మోహన నాయుడు అన్నారు. శనివారం కార్ షెడ్ కూడలి, అంతర్జాతీయ క్రికెట్ మైదానం చేరువలో శ్రీ వృక్ష విద్యాసంస్థల నూతన ప్రాంగణం (జూనియర్ ఇంటర్ కళాశాల) ను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు,రాష్ట్ర టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశిష్ట అతిథులుగా భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు,ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి సభ్యులు వేపాడ చిరంజీవి రావు, ప్రభుత్వ విప్.. ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు,విశాఖఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు,ఎన్.ఐ.ఎఫ్.ఎస్. విద్యాసంస్థల అధినేత సునీల్ మహంతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ వృక్ష విద్యాసంస్థను ప్రారంభించారు. కళాశాల అధినేత, డైరెక్టర్ బీవీ రమణమూర్తి దంపతులకు అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రి కింజారాపు రామ్మోహన నాయుడు మాట్లాడుతూ.. శ్రీవృక్ష విద్యాసంస్థలు విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకాలని ఆకాంక్షించారు.విద్యార్థి భవిష్యత్ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని నిర్ధారించే సమయంగా కళాశాల రోజులు నిలుస్తాయని అన్నారు.భవిష్యత్ జీవనానికి కళాశాల విద్య పునాదిఅని,తమ లక్ష్య సాధనకు ఇంటర్మీడియట్ నుండి బలమైన పునాదులు వేసుకోవాలని అన్నారు. నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలని సూచించారు. విజయపజయాలు సర్వసాధారణమని జిజ్ఞాస,ఆసక్తి కలిగి ఉండడం ప్రధానమన్నారు.వ్యక్తి జీవితాన్ని మూడు అంశాలు ప్రభావితం చేస్తాయని చెప్పారు. మనిషి మేధస్సుకు కష్టించేతత్వం జోడిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అని తెలిపారు. శ్రీ వృక్ష విద్యాసంస్థల విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు కలగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.విద్యార్థులు తమ మేదస్సును,జ్ఞానాన్ని నూతన ఆవిష్కరణలు జరపడానికి వినియోగించాలని సూచించారు.సమాజం పై బాధ్యతను విద్యార్థులకు తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో 6వ వార్డు టిడిపి అధ్యక్షులు దాసరి శ్రీనివాస్,5వ వార్డ్ అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ,(జపాన్),నమ్మి రమణ,గరే గురునాథ్,కానూరు అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.