- పాలసీలు మారుస్తాం
- పెట్టుబడుల కోసం మార్పులు చేస్తాం
- పుష్కలంగా వాణిజ్య అవకాశాలు
- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మేలు
- విశాఖ సీఐఐ సమ్మిట్ కు రండి
- ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు
- యూఏఈ వ్యాపారవేత్తలతో వరుస భేటీలు
ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈలో తన తొలి రోజు పర్యటన ప్రారంభించారు. ఏపీ-యూఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలపడేలా సహకరించాలని సీఎం చంద్రబాబు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధులను కోరారు. షిప్ బిల్డింగ్ నుంచి డేటా సెంటర్ల వరకు ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. యూఏఈలోని తెలుగువారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న చంద్రబాబుకు అక్కడి తెలుగు వారి నుంచి ఘనస్వాగతం లభించింది. పెట్టుబడుల సాధనకు, నవంబర్ నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానాలు పలికేందుకు యూఏఈలో మూడు రోజుల పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు దుబాయ్ చేరుకున్నారు. దుబాయ్, అబుదాబి దేశాల్లో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ సతీశ్ కుమార్ శివన్, అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్తో సీఎం సమావేశమయ్యారు.
పుష్కలంగా వనరులు
దుబాయ్ సహా యూఏఈ దేశాల్లోని వివిధ కంపెనీల వివరాలు, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉంటుందన్న అంశాలపై వారితో చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్, పెట్రో కెమికల్స్, పోర్టులు, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఇండస్ట్రియల్ పార్కులు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, ఆతిధ్య రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీలో వనరులు, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చంద్రబాబు వివరించారు. గూగుల్ సంస్థ విశాఖలో అతిపెద్ద డేటా ఏఐ హబ్ 15 బిలియన్ డాలర్లతో పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. ఏపీకి 1054 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టు వెల్లడించారు. యూఏఈ దేశాల సావరీన్ ఫండ్స్ ద్వారా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపైనా వారితో చర్చించారు. ఏపీలో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా దుబాయ్ సహా వివిధ దేశాల కంపెనీలకు వివరించాలని ఎంబసీ ప్రతినిధులకు సీఎం సూచించారు. ఇప్పటికే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ దేశాలకు చెందిన వివిధ సంస్థలు ముందుకు వచ్చిన నేపథ్యంలో ఏపీలో ఉన్న అవకాశాలను ఆయా దేశాల్లోని కంపెనీలకు వివరించాలని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తోందని వివరించారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సీఐఐతో కలిసి భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని యూఏఈలోని వివిధ సంస్థలను ఆ సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రధాని మోదీ చొరవ వల్లే దేశంలో చాలా మార్పులు వచ్చాయనీ, భారత్ను పెద్ద ఎత్తున ఆయన ప్రమోట్ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరగడానికి ప్రధాని చేస్తున్న కృషే కారణమని వెల్లడించారు. ట్రేడ్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత్ దేశానికి యూఏఈ భాగస్వామిగా ఉందని దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ సతీశ్ కుమార్ శివన్ వెల్లడించారు. ఇరుదేశాల పరస్పర పెట్టుబడులతో బంధం మరింత బలపడిందని సీఎంకు వివరించారు. మూడేళ్లలో 50 శాతం మేర ఇరుదేశాల మధ్య వాణిజ్యం పెరిగిందని తెలిపారు. యూఏఈ టెక్నాలజీ రంగంపై ఎక్కువగా వ్యయం చేస్తోందని భారత్ నుంచి వచ్చే నిపుణులకు భారీ ఎత్తున అవకాశాలు ఉన్నాయని సతీశ్ కుమార్ శివన్ చెప్పారు.
ప్రస్తుతం యూఏఈ నాన్ ఆయిల్ ఎకానమీ వైపుగా దృష్టి పెట్టిందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై యూఏఈ 2017లోనే ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిందని వివరించారు. యూఏఈలో 23 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్ పెట్టిందని ఇందులో 50 శాతం గత ముడేళ్లలో వచ్చినవేనని యూఏఈలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఏ.అమర్నాధ్ తెలిపారు. భారత్లోని విద్య వైద్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ ఆసక్తి చూపుతోందన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ పార్క్ లోనూ యూఏఈ నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అమర్నాధ్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దుబాయ్లోని అంతర్జాతీయ స్థాయి సంస్థలకు అవసరమైన టెక్నాలజీ నిపుణులను అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని చంద్రబాబు చెప్పారు. దుబాయ్లో వివిధ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. పారిశ్రామికవేత్తలతో ‘వన్ టు వన్’ సమావేశాల్లో సీఎం పాల్గొన్నారు. షరాఫ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ షరాఫుద్దీన్ షరాఫ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యి ఏపీలో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించారు. లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు షరాఫ్ గ్రూప్ను సీఎం ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారత్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు షరాఫ్ సంస్థ సీఎంకు తెలిపింది. రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే పాలసీలు మారుస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు రూ.100 కోట్లు విరాళం ప్రకటించడంపై ప్రత్యేకంగా అభినందించారు. దుబాయ్ లోని ప్రముఖ రియాల్టి సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్తో సీఎం సమావేశం అయ్యారు.
యూఏఈలో తెలుగువాళ్లు ఉన్నారనీ వారికి అవసరమైన సహకారాన్ని అందించాలని ఎంబసీ ప్రతినిధులను ఆయన కోరారు. దుబాయ్లో తన పర్యటన చివరి రోజున తెలుగు డయాస్పోరా కార్యక్రమం నిర్వహించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ నుంచి దుబాయ్కు చేరుకున్న చంద్రబాబుకు స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. దుబాయిలో ఉన్న తెలుగు వారు ప్రత్యేకించి మహిళలు తెలుగు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి సీఎంకు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం తెలియచేశారు. తనకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని చంద్రబాబు అప్యాయంగా పలకరించారు.

