అల్లూరి జిల్లా : జయజయహే : దేశీయ విత్తన సంపత్తిని వారసత్వ సంపదగా తీర్చిదిద్దు కోవాలని జలబీరాద్రి సంస్థ జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యన్నారాయణ కోరారు. శనివారం మధ్యాహ్నం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లమ్మసింగి పంచాయతీ రావి మాను పాకల గ్రామంలో సిఫా ట్రస్ట్ సిఇఒ డాక్టర్ శశి ప్రభ నేతృత్వంలో నిర్మించిన చెక్ డ్యాంను ప్రారంభించిన అనంతరం సర్పంచ్ శాంతకుమారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జలవనరులు సద్వినియోగం చేసుకోవాలి, దేశీయ విత్తనాలను కాపాడుకోవాలి అని కోరారు. ఈ చెక్ డ్యాం ద్వారా ఆ వాగు నీరు 14 కుటుంబాలకు చెందిన 46 ఎకరాల్లో సంవత్సరం పొడవునా పంటలు పండించ వచ్చని ఇది చాలా ఆనంద దాయకం అన్నారు. ఇదె విధంగా అన్ని కొండల్లో వాగులకు అడ్డుకట్ట వేసి ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలని కోరారు. ఆదే విధంగా 150 కి పైగా రకాల దేశీయ విత్తనాల నిధి ద్వారా ఏర్పాటు చేసిన విత్తన ప్రదర్శన ఆనందదాయకంగా ఉంది అని అభినందించారు. సిఫా సంస్థ సిఇఒ డాక్టర్ శశి ప్రభ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా లోని చింతపల్లి మండలం లమ్మసింగి పంచాయతీ లో 12 గ్రామాలను దేశీయ విత్తనాల గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతోందన్నారు. అరావళి పర్వతాలలో వలే లమ్మసింగి ప్రాంతంలో దేశీయ విత్తన పర్యాటక గ్రామాలు అభివృద్ధి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. ఇందులో భాగంగా దేశంలో వ్యవసాయం మొదలైన పదివేల సంవత్సరాలు కిందటి కాలం లోని విత్తనాలు దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాల్లో నుంచి, కృష్ణా, గోదావరి నదుల్లో ని లంకల నుంచి, తూర్పు కనుమలలోని మారుమూల గ్రామాల్లోంచి చిరు ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, కందమూలాదులు, పండ్లు జాతి మొక్కలు తీసుకుని వచ్చి నాటి పెంచె కార్యక్రమాలు నిర్వహించడం జరిగుతోంది అని వివరించారు. అలాగే సాగు నీటి వసతి, తాగునీటి వసతి కల్పించేందుకు కృషి చేస్తోంది. అలాగే విత్తనాలు ఇచ్చి పుచ్చుకునే విధానం అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శాంతకుమారి, ఎంపిటిసి నాగమణి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పాల్గొని మాట్లాడారు, అలాగే సిఫా సంస్థ ప్రతినిధులు నర్సింగ్, రామలక్ష్మి, భాస్కర్, శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, రాజు, రాము తదితరులు పాల్గొన్నారు.