ఎం వి పి కాలనీ : జయజయహే : ధరిత్రి దినోత్సవం జయప్రదం చేయండి అని ఎపి స్టేట్ ఎస్ టి కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు కోరారు. మంగళవారం ఉదయం ఆయన ఎంవిపి కాలనీలో విలేకరులతో మాట్లాడారు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా తాను సైతం పక్షులు, వన్యప్రాణులు కోసం నీరు మట్టి పాత్రలలో అందుబాటులో ఉంచానని, పిచ్చుకల కోసం గూళ్ళు, ధాన్యం కంకుల కుచ్చులు ఏర్పాటు చేసామని తెలిపారు. సమస్త జీవరాశి జీవించడానికి కృషి చేయండని పిలుపునిచ్చారు. మనిషి జీవులు గూడు చేయలేదని, భూమి మీద ఉన్న సమస్థ జీవరాశిలో మనిషి కూడా ఒక భాగమే అన్నారు. ప్రధానంగా మన ఇంటి పిచ్చుకలు పది వేల సంవత్సరాల క్రితం మనం వ్యవసాయం మొదలు పెట్టిన దగ్గర నుంచి మన ఇంటి వద్ద సూరుల్లో గూళ్ళు పెట్టుకుని జీవించడం మొదలు పెట్టాయి అన్నారు. ఇప్పుడు వాటి సంఖ్య 80 శాతం తగ్గిపోయింది కాబట్టి వాటి పరిరక్షణకు కృషి చెయ్యాలి అని కోరారు. శీతోష్ణస్థితి వేడెక్కి పోతున్న తరుణంలో పక్షులు వన్యప్రాణులు కోసం నీరు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొన్నారు.