విజయనగరం, జయజయహే : భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని దేశం గర్వించే స్థాయికి ఎదగాలని కోరారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ జంక్షన్ (బాలాజీ జంక్షన్) వద్దనున్న బాబాసాహెబ్ విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్య ద్వారానే అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చునని స్పష్టం చేశారు. దీనికి అంబేద్కర్ మహనీయుని జీవితమే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఒక చిన్న కు గ్రామంలో అట్టడుగు వర్గంలో జన్మించిన అంబేద్కర్, విద్య ద్వారానే నేడు ప్రపంచ ప్రజల జేజేలను అందుకుంటున్నారని కొనియాడారు. విద్య, సమానత్వం, సాంఘిక న్యాయం, మహిళల హక్కుల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని మనకోసం రూపొందించారని అన్నారు. నేడు బడుగు బలహీన వర్గాలకు విద్య, సమానత్వం, రిజర్వేషన్లు, వివిధ సంక్షేమ పథకాలు, హక్కులు అందుతున్నాయంటే, అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చలవేనని పేర్కొన్నారు. ఆయన జీవిత చరిత్రను అధ్యయనం చేసి, స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ముందడుగు వేయాలని మంత్రి కోరారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, అంబేద్కర్ కేవలం దళితులకే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి ఆదర్శనీయులని కొనియాడారు. తనకు ఎంపీ పదవి రావడానికి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని చెప్పారు. కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అంబేద్కర్ జీవిత చరిత్ర స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఆయన భావాలు, ఆలోచనలు నిత్యం అనుసరణీయమని పేర్కొన్నారు. అంబేద్కర్ అందరివాడని, దళితులు లేని గ్రామాల్లో కూడా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ స్వగ్రామం విఎన్ పురంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలోని తన నివాసంలో గదులను సివిల్ సర్వీసులకు శిక్షణ పొందుతున్న పదిమంది తెలుగు విద్యార్థులకు కేటాయించడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన విద్యార్థిని అరుంధతికి భవిష్యత్తులో అన్ని విధాల సహకారం అందిస్తామని ప్రకటించారు. బడుగు బలహీన వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చి, వారిని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ మాట్లాడుతూ అంబేద్కర్ గొప్పదనాన్ని కొనియాడారు. చిన్నప్పటి నుంచి అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పుటికి, విద్య ద్వారా అందరికీ నిలువెత్తు ఆదర్శమూర్తిగా ఎదిగారని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని మనకందించి, సమ సమాజం, న్యాయం, రిజర్వేషన్లు, మహిళల హక్కుల కోసం కృషి చేశారని చెప్పారు. అంబేద్కర్ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినిలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా చీపురుపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికలు ప్రదర్శించిన బ్యాండ్ మేళం ఆకట్టుకుంది. ప్రముఖ కళాకారుడు ఆర్బి రామానాయుడు అంబేద్కర్ వేషధారణలో చేసిన ఏకపాత్రాభినయం ఆలోచింపజేసింది. అంబేద్కర్ జీవిత చరిత్రను, గొప్పదనాన్ని విద్యార్థినిలు తమ ప్రసంగంలో వివరించారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.రామానందం, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు పి.చిట్టిబాబు, ఎస్.రామస్వామి మాట్లాడుతూ అంబేద్కర్ గొప్పతనాన్ని కొనియాడారు. వివిధ దళిత, ఆదివాసి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బొంగ భానుమూర్తి, గంటాన అప్పారావు, ఆదాడ మోహన్రావు, నడిపేన వెంకటేష్, తుమ్మి అప్పలరాజు దొర, ఎం సూర్యచంద్రరావు, సిహెచ్ బంగారురాజు, బుడుమూరు శంకర్రావు తదితరులు మాట్లాడుతూ, అంబేద్కర్ జీవిత విశేషాలను, జాతి అభివృద్ధికి ఆయన చేసిన కృషిని వివరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంఘాలు సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.