విజయనగరం,జయజయహే: 200 ఏళ్ల క్రితమే నవ సమాజ స్థాపనకు బాటలు వేసిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జన్మదినోత్సవ వేడుకలు కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ముందుగా కలెక్టరేట్ సమీపంలోని ఫూలే, సావిత్రిబాయి విగ్రహాలకు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జయంతి సభ నిర్వహించారు. పూలే చిత్రపటానికి అతిధులంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ, సమాజానికి ఫూలే చేసిన సేవలను శ్లాఘించారు. సమాజంపై చెరగని ముద్ర వేసిన ఆ మహనీయుడు పుట్టిన 199 ఏళ్ల తరువాత కూడా, స్మరించుకోవడం ఫూలే గొప్పదనానికి నిదర్శనమని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందే నవ సమాజ సాధనకు ఫూలే పునాది వేశారని అన్నారు. ఆయన ఆలోచనలు, కృషి ఫలాలు నేటి తరం అందుకుంటోందని చెప్పారు. ఫూలే సహధర్మచారిని సావిత్రిభాయి ఫూలే స్త్రీవిద్యకోసం పాటుపడ్డారని చెప్పారు. వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఫూలే దంపతులకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఫూలే భవన నిర్మాణానికి, అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర తూర్పుకాపు ఛైర్పర్సన్ పాలవలస యశస్వి మాట్లాడుతూ, ఫూలే ను భారత సామాజిక విప్లవోద్యమ పితగా పేర్కొన్నారు. ఆయన సంఘ సంస్కర్తగా, ఒక నాయకుడిగా, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన వ్యక్తిగా, స్త్రీవిద్యకు ఆద్యుడిగా సమాజానికి బహుముఖ సేవలను అందించారని కొనియాడారు. కత్తి కంటే కలం గొప్పదని నిరూపిస్తూ, ఆయన రచనలు సమాజాన్ని ఎంతగానో కదిలించాయని చెప్పారు. బిసిలు సమాజానికి వెన్నుముఖ లాంటివారని పేర్కొన్నారు. తమ అభివృద్ది కోసం బిసిలంతా కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ మాట్లాడుతూ, సుమారు 150 ఏళ్ల క్రితమే ఎంతో దూరదృష్టితో ఆలోచించి, సమాజ చైతన్యానికి కృషి చేసిన ఫూలే మహాత్ముడుగా పిలవబడ్డారని అన్నారు. మహిళల హక్కులు, వారి విద్యకోసం విశేష కృషి చేశారని కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాలకోసం ఎంతగానో పాటుపడ్డారని చెప్పారు. వారి విలువలు, సిద్దాంతాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా సుమారు 400 మంది బిసిలకు రుణాలను, ఉపకరణాలను పంపిణీ చేశారు. ఫూలే ఏకపాత్రాభినయాన్ని అద్భుతంగా ప్రదర్శించిన ప్రముఖ కళాకారుడు ఆర్బి రామానాయుడును సత్కరించారు. అంతకుముందు వివిధ బిసి సంఘాల నాయకులు ముద్దాడ మధు, వై.శంకర్రావు, విజయలక్ష్మి, గొలగాని రమేష్, కిల్లంపల్లి ఆచారి తదితరులు మాట్లాడుతూ జ్యోతిరావు గొప్పదనాన్ని కొనియాడారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, జిల్లా బిసి సంక్షేమాధికారిణి జ్యోతిశ్రీ, బిసి కార్పొరేషన్ ఇడి పెంటోజీరావు, ఏబిసిడబ్ల్యూఓలు, సంక్షేమాధికారులు, జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నవ సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు ఫూలే జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
0
11
RELATED ARTICLES
- Advertisment -