జయజయహే : రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అమరావతిలో స్టేడియం నిర్మించాలని ఏపీ మంత్రి నారా లోకేష్, బీసీసీఐ కార్యదర్శి జైషాను కలిసిన సమయంలో కోరారు. దీంతో.. ఈ విషయంలో బీసీసీఐ కూడా సీరియస్గానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అమరావతిలో ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చులో 60 శాతం బీసీసీఐ భరించనుంది. మిగతా మొత్తాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున ఏపీ ప్రభుత్వం భరించే అవకాశం ఉంది. మొత్తం వచ్చే ఏడాదికి లేదా 2027 వరకు అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతో ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఏపీ ప్రభుత్వంతో పాటు బీసీసీఐ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తోంది. అలాగే ఈ స్టేడియంలో ప్రతి ఏడాది కనీసం ఓ 10 అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించాలనే ప్రతిపాదనకు కూడా బీసీసీఐ అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే కొన్నేళ్లలో ఏపీకి ఒక ఐపీఎల్ టీమ్ను కూడా కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్లో 10 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఈ సంఖ్యను 12కు పెంచాలని కూడా బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఆ రెండు కొత్త టీమ్స్లో ఏపీకి ఒక అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ముందుగా అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరిగిన తర్వాత.. మిగతా పనులు కూడా ఒక్కొక్కటిగా జరిగే అవకాశం ఉంది.