భారతదేశపు అతి పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది.. 2025 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వేదిక గ్లోబల్ యంగ్ లీడర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబరిచిన యువ నాయకులను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంపిక చేస్తుంది. ఈ జాబితాలో రామ్మోహన్ నాయుడుకు చోటు దక్కింది. ప్రపంచంలోని అత్యంత చైతన్యవంతమైన, దూరదృష్టి గల నేతగా నిలిచారు. ప్రభావవంతమైన మార్పుని కలిగించే వినూత్న పాలన ఉద్దేశ్యంతో ప్రజా సేవలో ఉన్న 40 ఏళ్లలోపు యువ నాయకత్వంలో రామ్మోహన్నాయుడికి స్థానం దక్కింది.. ఈ సంవత్సరం 50 దేశాలలో 116 మంది నాయకులు ఎంపిక కాగా, భారతదేశం నుండి ఏడుగురు ఎంపికయ్యారు. భారతదేశ ప్రజాస్వామ్య యువ-ఆధారిత రాజకీయ పరివర్తనకు గర్వించదగిన ప్రతినిధిగా రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు. 2014లో 26 ఏళ్ల వయసులో పార్లమెంట్లోని అతి పిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచిన రామ్మోహన్ నాయుడు.. మూడు సార్లు ఎంపీగా గెలిచారు. 2024లో ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర కేబినెట్ మంత్రి అయ్యారు. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు నాయకత్వంలో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమాన ప్రయాణాన్ని ప్రజాస్వామికరణ, మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరించడం, దేశంలోని మారుమూల ప్రాంతాలకు యూ.డి.ఏ.ఎన్ కనెక్టివిటీని విస్తరించడం జరిగింది. భారతదేశం విమానయాన పర్యావరణ భవిష్యత్తులోకి సుస్థిరత సాధించే దిశగా సంస్కరించడం జరిగింది. కాగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుండి గతంలో పలువురు యువ నేతలకు గుర్తింపు లభించింది. ఈ జాబితాలో జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, నారా లోకేష్ ఇటీవలి కాలంలో రితేష్ అగర్వాల్ వంటి భారతీయ నాయకుల జాబితాలో రామ్మోహన్ నాయుడు చేరారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ముఖ్యమైన, ప్రభావితమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో భారత యువత ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత మైలురాయి కాదని, ప్రజలకు, మన దేశానికి మెరుగైన భవిష్యత్తును రూపొందించడానికి బాధ్యతను గుర్తు చేస్తుందన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అతి పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రిగా సేవ చేయడం అద్భుత ప్రయాణంగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన మార్గం ప్రేరణనిచ్చిందన్నారు. 2019లో యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపికైన మొదటి తెలుగు రాజకీయ నాయకుడిగా నిలిచిన నారా లోకేశ్ను గుర్తుచేసుకుంటున్నానన్నారు. ప్రపంచ వేదికపై తెలుగుదేశం పార్టీ నాయకులు వేసిన మార్గంలో నడవడం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. ఈ గౌరవం నమ్మి, మార్గనిర్దేశం చేసిన, సేవ చేయడానికి బలాన్ని ఇచ్చిన ప్రజలకు చెందుతుందన్నారు.
బాబు, లోకేశ్ విషెస్..
యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపికైన రామ్మోహన్ నాయుడుకి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు దేశానికి, ముఖ్యంగా తెలుగువారికి గర్వకారణమన్నారు. ప్రజాసేవలో రామ్మోహన్ అంకితభావం యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. రామ్మోహన్ యంగ్ గ్లోబల్ లీడర్ గా ఎంపిక కావడం ఏపీకి, భారత్ దేశానికి గర్వకారణమని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నుంచి ప్రేరణ పొందడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని లోకేశ్ ఆకాంక్షించారు.