మారుతున్న సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం విపరీతంగా పెరిగింది. తక్కువ ఉత్పత్తి జీవితకాలం, నిరంతర సాంకేతిక నవీకరణల కారణంగా పాత పరికరాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు లేదా ఈ-వేస్ట్గా మారుతున్నాయి. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారతదేశం, ఈ సవాల్ను ఎదుర్కొంటోంది. ఇది పర్యావరణానికి మాత్రమే కాకుండా ప్రజారోగ్యానికి కూడా తీవ్రమైన ప్రమాదంగా మారింది. ఈ వ్యర్థాల సమర్థ నిర్వహణ కోసం ప్రభుత్వం, ప్రజలు రెండూ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
భారతదేశంలో ఈ-వేస్ట్ ఉత్పత్తి వేగం ఆందోళన కలిగిస్తోంది. 2024 సెప్టెంబర్ నాటి గణాంకాల ప్రకారం, ఈ-వేస్ట్ ఉత్పత్తిలో చైనా, అమెరికా తరువాత భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) నివేదికల ప్రకారం, దేశంలో ఈ వ్యర్థాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2017-18లో సుమారు 7.08 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న ఈ-వేస్ట్, 2024-25 నాటికి దాదాపు 13.98 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. అధికారికంగా సేకరించి ప్రాసెస్ చేయబడుతున్న పరిమాణం పెరగడం శుభవార్తే అయినప్పటికీ, ఇంకా దాదాపు 30 శాతం వ్యర్థాలు అసంఘటిత రంగంలోనే నిర్వహించబడుతున్నాయి. అక్కడ కార్మికులు, ముఖ్యంగా పిల్లలు, ఎలాంటి రక్షణ లేకుండా విషపూరిత పదార్థాలకు గురవుతున్నారు.
ఈ-వేస్ట్లో పాదరసం, సీసం, కాడ్మియం, క్రోమియం వంటి విషపూరితమైన లోహాలు ఉండటం పెద్ద ప్రమాదం. వీటిని సరిగా శుద్ధి చేయకుండా పారవేయడం లేదా కాల్చడం వల్ల భూమి, గాలి, నీరు అన్నీ కలుషితం అవుతున్నాయి. భూగర్భ జలాల్లోకి ఈ రసాయనాలు చొచ్చుకుపోయి ఆహార గొలుసులోకి చేరి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ప్లాస్టిక్ భాగాలు, సర్క్యూట్ బోర్డులను కాల్చడం వల్ల డయాక్సిన్లు, ఫ్యూరాన్స్ వంటి అత్యంత విషపూరిత వాయువులు విడుదలవుతున్నాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, నాడీ సంబంధిత రుగ్మతలకు కారణమవుతున్నాయి. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, వారితో నివసించే కుటుంబాలు నిరంతరం ఈ విషపూరిత వాతావరణానికి గురవుతుండటంతో మెదడు దెబ్బతినడం, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితిని ఎదుర్కొవడానికి ప్రభుత్వ చర్యలు కీలకం. 2022లో ప్రవేశపెట్టిన ఈ-వేస్ట్ (నిర్వహణ) నియమాల ప్రకారం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే సంస్థలు తమ ఉత్పత్తుల జీవితకాలం పూర్తయిన తర్వాత వాటిని సేకరించి రీసైకిల్ చేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నాయి. విస్తృత తయారీదారుల బాధ్యత (EPR) విధానాన్ని కఠినంగా అమలు చేయడం అవసరం. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు శిక్షణ, రక్షణ పరికరాలు అందించి వారిని అధికారిక రీసైక్లింగ్ వ్యవస్థలో చేర్చాలి. ప్రతి రాష్ట్రంలో అధునాతన రీసైక్లింగ్, డిస్మాంట్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం కూడా అత్యవసరం.
ప్రజల పాత్ర కూడా ఈ సవాల్ పరిష్కారంలో అంతే ముఖ్యమైనది. పాత ఎలక్ట్రానిక్ పరికరాలను చెత్తలో పారేయకుండా అధికారిక సేకరణ కేంద్రాలు లేదా CPCB-రిజిస్టర్డ్ రీసైక్లర్లకు అప్పగించాలి. పాడైన వస్తువులను వీలైనంత వరకు మరమ్మతు చేయించి తిరిగి ఉపయోగించుకోవడం ద్వారా వ్యర్థాల పరిమాణం తగ్గించవచ్చు. కుటుంబం, స్నేహితులు, సమాజంలో ఈ-వేస్ట్ నిర్వహణపై అవగాహన పెంపొందించడం కూడా ప్రతి పౌరుడి బాధ్యత.
భారతదేశం యొక్క భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం అన్నీ ఈ అంశంపై మన సమిష్టి చర్యలపై ఆధారపడి ఉన్నాయి. ప్రభుత్వం కఠిన నిబంధనలు, మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రజలు బాధ్యతాయుత వినియోగం పాటించడం ద్వారానే ఈ పెరుగుతున్న ఈ-వేస్ట్ మహమ్మారిని నియంత్రించి ఆరోగ్యకరమైన, కాలుష్యరహిత భారతదేశాన్ని నిర్మించగలం.
(సి. హెచ్. ప్రతాప్)

