ఈ దీపావళి పండుగకు మరో కొత్త పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా ‘మహాశక్తి’ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పింది. ఇందులో భాగంగా ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగంజాగర్లమూడిలో నిర్వహించిన పల్లెపండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 1.40 కోట్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని.. ప్రతీ కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘తదుపరి మంత్రివర్గ భేటీలో ఈ పథకానికి అనుమతి తీసుకుంటామని, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ఏడాదికి రూ.3,640 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. దీపావళి సందర్భంగా ప్రతి ఇంట్లో పండుగ వెలుగులు తీసుకొస్తాంమనిమని కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని మహిళలు పెద్దఎత్తున ఆశీర్వదించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని.’ అని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో 1.40 కోట్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని.. ప్రతీ కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.