జయజయహే : గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ లో మేయర్ హరికుమారిపై అవిశ్వాసం పెట్టిన విజయం సాధించిన నేపథ్యంలో పాలక వర్గంపై కూటమి ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులుకు నేతలను ఎంపిక చేసే పనిని చేపడుతున్నట్లు తెలిసింది. ఇందుకు పలు సామాజిక, రాజకీయ సమీకరణాలతో బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం. మేయర్ అభ్యర్థిగా ఏ సామాజిక వర్గానికి చెందిన నేత ఉంటే బాగుంటుంది.. రాజకీయంగా కలిసి వస్తుందనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. అలాగే డిప్యూటీ మేయర్లుగా ఎవరు ఉంటే కలసి వస్తుందనే అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా 96 వార్డు కార్పొరేటర్ గా పీలా శ్రీనివాసరావును మేయర్ గా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల సమయంలోనే ఈ మేరకు ఆయన హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పీలానే ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ లో ప్రస్తుతం ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉన్నందున కూటమి లో కూడా అలానే కొనసాగించాలని భావిస్తున్నారు. అయితే మేయర్ పీలాకు ఇస్తున్న పరిస్థితుల్లో డిప్యూటీ మేయర్ గా మహిళకు అవకాశం కల్పిస్తారని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ మేరకు టీడీపీలో ఐదో వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలతకు అవకాశం దక్కుతుందంటున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆమె పేరు పరిశీలనలో ఉంటుందని విశ్లేషిస్తున్నారు. వైసీపీ హయాంలో మేయర్ హరికుమారి యాదవ సామాజికవర్గం కావడంతో, ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి అదే యాదవ సామాజిక వర్గానికి హేమలతకు ఇవ్వడంతో సరి చేయాలని చేస్తున్నారు. తద్వారా యాదవ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లు అవుతుందని అధిష్టానం కూడా భావిస్తున్నట్లు తెలిసింది. బాగా విద్యాధికురాలు కూడా మొల్లి హేమలేత కావడంతో ఆమెకు డిప్యూటీ మేయర్ గా అవకాశం కల్పించడం ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగు దేశం పార్టీలోని కీలక నేతలు సైతం మొల్లి హేమలత అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్లు తెలుస్తోంది. మరో డిప్యూటీ మేయర్ గా కాపు సామాజిక వర్గానికి కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు కాపు సామాజిక వర్గానికి చెందిన గంథం శ్రీనివాస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.