Tuesday, June 17, 2025
HomePOLITICSచిత్రాడ చిత్రం...కెవ్వు కేక

చిత్రాడ చిత్రం…కెవ్వు కేక

జనసేన పార్టీ పదకొండేళ్లు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్బంగా ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలోగల చిత్రాడ గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అధిక జన సమీకరణకు పార్టీ నాయకత్వం కష్టపడి పనిచేసింది. వచ్చిన వారికి తగిన ఏర్పాట్లను కూడా చేసింది. పార్టీ నాయకులు చెప్పే ఉపన్యాసం ఆసాంతం వినేందుకు పెద్ద పెద్ద మైకులు ఏర్పాటు చేశారు. చూసేందుకు పెద్ద పెద్ద సినిమా సైజులో ఎల్.ఇ.డి. స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. కార్యకర్తలను ఆనందపర్చేందుకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాలను చూస్తూ కార్యకర్తలు ఆనందపరవశులయ్యారు. సభకు కావలసినంత బందోబస్తును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అధిక సంఖ్యలో శాసన సభ్యులు, మంత్రులు, ఇతర ముఖ్యమైన నాయకులు హాజరయ్యారు. కాబట్టి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఒకటి, రెండు చెదురు మదురు సంఘటనలు మినహా కార్యక్రమం విజయవంతమయ్యింది.ప్రతి రాజకీయ పార్టీ మూడేళ్లకోసారి పార్టీ ప్లీనరీలు, పార్టీ ఎన్నికలు జరిపి రాజకీయ పార్టీ ఎందుకు స్థాపించాము, పార్టీ యొక్క విధి, విధానాలు ఏంటి, రాజకీయ ఏర్పాటు ముఖ్యోద్దేశం, మూల సిద్ధాంతాన్ని ఆయా పార్టీల ఆవిర్భావ ఉత్సవంలో గాని, పార్టీ సంస్థాగత ఎన్నికల్లో గాని చర్చలు జరుగుతాయి. పార్టీల సభల్లో తీసుకున్న నిర్ణయాలు అమలయ్యేటట్లు కృషి చేస్తాయి. పార్టీ తీసుకున్న నిర్ణయాలు ప్రజల అభిప్రాయానికి సరిపోయేటట్లు ఆలోచనలు చేస్తాయి. వాటిని అమలు పర్చేందుకు పార్టీలను దశల వారీగా గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాయి. అవసరమైతే ప్రజల తరపున పోరాటాలు చేయాలని నిర్ణయాలు తీసుకొని ప్రజల తరుపున పోరాటానికి సిద్దమవుతాయి .కానీ చిత్రాడలో చిత్రమేమిటంటే అదొక సినిమా వంద రోజుల విజయోత్సవంలా జరిగింది. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ సాధించిన విజయాలు ఏమిటో, అపజయాలు ఏమిటో, విధి విధానాలు ఏమిటో చర్చకు రానే రాలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ప్రజలకు ఎలాంటి పరిపాలన అందించామో కూడా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో చర్చకు రానేలేదు.రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రసంగిస్తున్నపుడు రాజకీయ నాయకుడిలా మాట్లాడాలని కూడా తెలియని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు కొణిదల నాగబాబు సినిమా నటుడు గానే ప్రసంగించడం రాజకీయ పార్టీలకు ఆశ్చర్యం కలిగించింది. పార్టీని స్థాపించిన తరువాత సాధించిన విజయాలు ప్రజలకోసం ఏ చేసాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనే అవగాహన, సరైన ప్రణాళిక లేకుండా ప్రసంగం పేలవంగా సాగింది. కూటమిలో భాగమైన జనసేన.. మిగతా పార్టీలకు జీవం పోసినట్లు మాట్లాడారు. అంటే రాజకీయాలమీద సరైన అవగాహన లేకుండా ఉండాలి లేదా అహంకారమైనా ఉండాలి. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుపుకు పిఠాపురం స్థానిక తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్మ కూడా పార్టీ అధినాయకుల ఆదేశాల మేరకు శక్తి వంచన లేకుండా పనిచేసి పవన్ గెలుపుకు కృషి చేశారు. పవన్ గెలుపునకు ఎవరు బాధ్యత కాదని, పిఠాపురం ప్రజలు మాత్రమేనని, మేమె గెలిపించాం, మా వల్లే పవన్ గెలిచాడని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ ఖర్మ అని అనేసారు నాగబాబు. అది టీడీపీ నాయకుడు వర్మను ఉద్దేశించి అన్నారని, ఆ పార్టీ స్థానిక నాయకత్వం, అధిష్టానం కూడా భావించింది. రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద విమర్శ చేయడం తప్పులేదు కానీ చేసే విమర్శ సమర్ధవంతంగా ఉండాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఒక హాస్యనటుడిగా చిత్రించి వ్యంగ్యంగా విమర్శ చేయడం రాజకీయ విశ్లేషకులు కూడా తప్పు పట్టారు. 2024 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత ఆ పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పరాజయం పొంది జనసేన పార్టీ కండువాలను కప్పుకున్నాడు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రసంగిస్తూ పార్టీ బలోపేతానికి ఏమి చేయాలి, ప్రజలకు ఎలాంటి ఆశలు, ఆశయాలు ఉంటాయో వాటిమీద ప్రసంగించాలి. జగన్ మీద దుమ్మెత్తి పోసి వచ్చే ఎన్నికలలో వైసీపీకి నామరూపాలు లేకుండా చేస్తాను, జగన్ అసలు ఎలా గెలుస్తాడో చూస్తాను అని ప్రగల్బాలు పలికి జనసేనకు నష్టమే చేకూర్చడమే కాకుండా, వైసీపీకి మేలు చేసేలా ఆయన ప్రసంగం సాగించాడు బాలినేని. బాలినేని ప్రసంగంపై వైసీపీ ప్రకాశం జిల్లా నాయకులు తీవ్రంగానే స్పందించారు. పేకాట ఆడటానికి ప్రత్యేకమైన విమానంలో రష్యా వెళ్లివచ్చిన వాడివి నువ్వు పవన్ సైగచేస్తే జిల్లా పరిషత్ని కైవసం చేసుంటాం అనడం దిగజారుడు రాజకీయమేనని ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బాచేపల్లి వెంకాయమ్మ బాలినేనిపై కళ్ళెర్రచేసారు. దమ్ముంటే జిల్లా పరిషత్ కూల్చు చూద్దాం అని హెచ్చరించారు కూడా. చిత్రాడ జనసేన ఆవిర్భావ దినోత్సవంలో బాలినేని ప్రసంగంపై వైసీపీ కేంద్ర నాయకత్వం గట్టిగానే స్పందించింది. బాలినేని పార్టీ విడిచిపోవడం సగం దరిద్రం పోయిందని, ఆ దరిద్రం జనసేనకు పట్టిందని వై. వి. సుబ్బారెడ్డి బావమరిది కాబట్టి నీకు ఇంకా ప్రకాశం జిల్లాలో కాస్త పరువు, మర్యాద ఉందని వైసీపీ విమర్శించింది. ఏమయినా బాలినేని ప్రసంగం జనసేనకు నష్టం కలిగించింది. కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన ఎలాంటి కార్యాచరణ చేస్తుందో కనీసం చెప్పకుండా జగన్ నామ స్మరణ చేసి జగన్ కు మేలు చేసాడు బాలినేని.చిత్రాడ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ అధినేత ప్రసంగం చాలా పేలవంగా మారింది. నాయకుడు అనేవాడు పార్టీ ప్రారంభం నుండి నేటివరకు సాధించిన విజయాలు, భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు, కార్యకర్తలకు వివరించాలి. కూటమిలో భాగమైన జనసేన ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు ఏమేరకు నెరవేర్చగలిగామని వివరించాలి. కానీ కాస్త విరుద్ధంగా మాట్లాడారు. నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీకి మనమే (జనసేన) జీవం పోశామని బహిరంగంగానే చెప్పారు. దానికి తెలుగుదేశం పార్టీ సామాజిక ప్రచార వ్యవస్థ తీవ్రంగా పరిగణించింది. రామారావును, లక్ష్మీపార్వతి గెలిపించడం ఎంత నిజమో, పవన్ కళ్యాణ్ టీడీపీకి జీవం పోసి గెలిపించడం అంతే నిజమని అంతర్జాల మాధ్యమాల ద్వారా దుమ్ము దులిపేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ని టీడీపీ సామాజిక మాధ్యమం లక్ష్మి పార్వతితో పోల్చింది. అంతే కాకుండా జనసేన పార్టీ బలాలను కూడా లెక్క కట్టేసింది. జనసేన 21 మంది శాసన సభ్యుల్లో 16 మంది టీడీపీ లో టికెట్ లభించకపోతే జనసేన టికెట్ ద్వారా గెలిపించామని తెలుగుదేశం రెండో వర్గ కార్యకర్తలు, నాయకులు, సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు.ఆంధప్రదేశ్ లోనే ఎన్నో సమస్యలున్నాయి. వాటిని గాలికి వదిలేసి హిందీ భాషమీద అభిమానం చూపి బీజేపీ ఎజండాను భుజాన వేసుకున్నాడు పవన్. అయినా ఫర్వాలేదు. తమిళ రాష్ట్రాన్ని, అక్కడి రాజకీయ సమాజాన్ని చిత్రాడ వేదికగా వేలెత్తి చూపాడు పవన్. హిందీ భాష అవసరం లేకపోతే తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకండని తమిళ సినీ పరిశ్రమకు సలహా ఇచ్చి, తమిళ సినిమాను డబ్ చేసి డబ్బు సంపాదించడానికి హిందీ భాష కావాలా అని తమిళ సినిమాపై తీవ్ర పదజాలం వాడారు పవన్. ఈ వ్యాఖ్యలకు తమిళ రాష్ట్ర రాజకీయ, సినీ పరిశ్రమ ప్రముఖులు తీవ్రంగానే స్పందించారు – కాదు గట్టిగానే గడ్డి పెట్టారు. డీఎంకే సీనియర్ నాయకులు పవన్ రాజకీయ నాయకుడు కాదు, ఎంటర్టైనర్ మాత్రమే అనేసారు. తమిళ రాష్ట్రం ద్విభాషాయుక్త రాష్ట్రమని దానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. మాకు తమిళం (మాతృభాషా) ఆంగ్లం (పరభాషా) ఇవి మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో భోదన చేస్తామని తెగేసి చెప్పారు. హిందీ సినిమాలు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో డబ్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ లో దక్షిణాది భాషలు అమలు చేస్తారా అని రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా పవన్ ను చీల్చి చెండాడారు. పవన్ కళ్యాణ్ నరేంద్రమోడీని, అమిత్ షాని భుజాన వేసుకొని మోస్తున్నారని ఆ విధానాలు ఇక్కడ అమలు కాలేవని, కానివ్వమని తమిళ రాజకీయ పార్టీలు గొంతెత్తాయి. మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అన్న(చిరంజీవి) పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసాడని, నువ్వు నీ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోమని సలహా ఇచ్చారు. పార్టీ ఆవిర్భావ సభ జనసేనకు ఉపయోకపడకపోయినా, నేను లేకపోతే టీడీపీ లేదు అనే మాట టీడీపీ కి ఒక అస్త్రంగా మారి జనసేన మీద దాడి చేయడానికి ఉపయోగపడింది. అన్ని విధాలా వైసీపీకి మంచి మైలేజీ వచ్చేలా కూడా ఉందనిపిస్తోంది. మరీ ముఖ్యంగా జనసేనను భుజాన మోస్తున్న కాపు సామాజిక వర్గం కాస్త నిరాశ, నిస్పృహలకు గురైంది. మన పార్టీ ఎదుగుదలకు ఆలోచన చేయకుండా చంద్రబాబు, లోకేష్ ల నాయకత్వానికి బలం చేకూర్చేలా పవన్ ప్రసంగం ఉండటం, కాపు సామాజిక వర్గానికి ఇబ్బందిగా మారింది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్లో మనుగడ సాగించాలంటే ఆ పార్టీ విధి, విధానాలు, మూల సిద్ధాంతాల కార్యాచరణ అమలు మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించలేము అనేది నిర్వివాదాంశం. ఆశ్చర్యం ఏంటంటే నాయుకుడు కళ్యాణ్ ఏమి మాటలాడిన కెవ్వుమని కేకలు వేయడమే తప్ప నాయకుడు ఏమి ఉపన్యాసం ఇస్తున్నాడో కూడా గ్రహించలేని స్థితిలో అభిమానులున్నారు. రాజకీయ ఆవిర్భావ సభ సినిమా వంద రోజుల విజయోత్సవ సభలా ఉందే తప్పా రాజకీయ సభలా లేదని జనసేన బహిరంగ విమర్శకు దారితీసింది.

మధు భోజంకి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments