ఏలూరు, జయ జయహే: ఆప్కాస్ పై ప్రభుత్వం తక్షణం విధి విధానాలను ప్రకటించాలని ఏఐటీయూసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి డాంగే,ఏపి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.ఏ.పి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు నగర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం యలగాడ శివకుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న రెడ్డి శ్రీనివాస్ డాంగే, భజంత్రీ శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఆప్కాస్ సమస్యను నివృత్తి చేయాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంపై ఇటు అధికారులపై ఎంతైనా ఉందన్నారు.కొన్ని నెలల క్రితం ఆప్కాస్ రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రివర్గం తెలపడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొందన్నారు .అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గత నెల 11న విజయవాడలో మున్సిపల్ కార్మికులు మహా ధర్నానిర్వహించిన తరుణంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో ఆప్కాస్ పై మంత్రివర్గ ఉప సంఘం వేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారని, అయితే మంత్రివర్గ ఉప సంఘం ఏమి నిర్ణయిస్తుందో తెలియక ముందే ఆప్కాస్ రద్దు అవుతున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సత్వరం మున్సిపల్ కార్మికుల అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉందన్నారు.అపరిష్కృతంగా ఉన్న ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెరుగుదలపై గత సమ్మెలో నాటి ప్రభుత్వం ఒప్పందం తక్షణ అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఇంజనీరింగ్ సిబ్బందికి సంక్షేమ పథకాలు వర్తింపచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏ.పి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమస్యలపై చర్చించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని కుటమి ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో యూనియన్ ఏలూరు నగర సమితి సభ్యులు ఇంటి అశోక్,కాకాని సుబ్బారావు,ఏ ప్రసాద్, ఫెడారివంశీ, అల్లం పెద్దిరాజు, పొన్నాడ మల్లేశ్వరరావు, మాడుగుల జగదీష్,అంత రాజ్ లీల, ప్రసాద్,ఎస్ సతీష్,బంగారు లోకేష్,తంగిల ఉమా తదితరులు పాల్గొన్నారు.