Tuesday, June 17, 2025
HomePOLITICSతల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చుతారా.....?

తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చుతారా…..?

తన ఫ్యామిలిలో ఆస్తుల వివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు. తమ ఉద్దేశ్యం కూడా గొడవలు పెట్టుకోవాలని కాదని చెప్పారు. సామరస్యంగా, నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని తెలుసన్నారు. “కానీ ఇది సామాన్యం అంటూనే.. అన్ని కుటుంబాల్లో జరిగేది అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకి ఈడ్చాడు. ఇది సామాన్య విషయం కాదు జగన్ సార్’ అంటూ షర్మిల కామెంట్స్ చేశారు. ఇవాళ విజయనగరం జిల్లాలోని గుర్లలోపర్యటించిన వైఎస్ జగన్… ఆస్తుల వివాదంపై స్పందించారు. అందరి ఇళ్లలో ఇలాంటి సమస్యలు ఉంటాయని.. వాటిని చూపించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా డైవర్ట్‌ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన తల్లి, చెల్లి ఫొటోతో సమస్యలను డైవర్ట్‌ చేస్తున్నారని అన్నారు. కుటుంబ కలహాలు అందరి ఇళ్లల్లో సామాన్యంగా ఉండేవేనని.. ప్రతీ ఇంట్లో ఉన్న గొడవలే తమ ఇంట్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రచారం ఆపి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల పరోక్షంగా స్పందిస్తూనే… కౌంటర్ ఇచ్చారు. సామాన్యం అంటూనే కోర్టుకు ఈడ్చారని అన్నారు. ఇది సామాన్యమేమి కాదంటూ కామెంట్స్ చేశారు. మొత్తంగా వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరినట్లు అయింది. ఎన్నికల కంటే ముందు నుంచే వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు తెరపైకి వచ్చాయి. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్, అవినాశ్ రెడ్డి లక్ష్యంగా వైఎస్ షర్మిల ప్రశ్నలు సంధించారు. ఏకంగా కాంగ్రెస్ లో పార్టీలో చేరి… కడప ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా కూడా షర్మిల ఉన్నారు. మరోవైపు అధికారం కోల్పోయిన జగన్… ప్రస్తుతం ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు. రాజకీయంగా జగన్, షర్మిల మధ్య మాటల యుద్ధం సాగిన సంగతి తెలిసిందే. తాజాగా అన్నా చెల్లెళ్ల మధ్య లేఖ యుద్ధం కాస్త నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను చేరింది. జగన్‌కు తెలియకుండా, అమోదం లేకుండా షేర్ల బదిలీ చేసుకోవడంతో వివాదం ముదిరింది. వైఎస్‌ జగన్‌కు ఆయన సోదరి షర్మిలకు మధ్య 2019లో ఆస్తి పంపకాలపై అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఉన్న కోర్టు వివాదాలు కొలిక్కి వచ్చిన తర్వాత ఆస్తులు, కంపెనీలలో వాటాల బదిలీ జరుగుతుందని పేర్కొన్నారు. 2021 జులై 26న మరో గిఫ్ట్‌ డీడ్ రాసుకున్నారు. ఈ మేరకు సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌ వృద్ధిలో తమ పాత్ర కీలకంగా ఉందని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. షర్మిలకు వాటాలు కేటాయించేందుకు తాము 2019 ఆగస్టు 21న అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశామని తెలిపారు. అయితే… వాటా కేటాయింపు ఇప్పటికీ ఖరారు కాలేదని… ఇది ప్రస్తుత వివాదానికి దారి తీసిందని పిటిషన్ లో ప్రస్తావించారు. పిటిషన్ ను స్వీకరించిన ఎన్ సీ ఎల్ టీ … ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 8, 2024కి షెడ్యూల్ చేసింది. ఈ కేసు దాఖలు నేపథ్యంలో… సరస్వతి పవర్ మరియు ఇండస్ట్రీస్‌పై మాత్రమే కాకుండా వైఎస్ కుటుంబంలోని విబేధాలకు మరింత ఆజ్యం పోసినట్లు అయిందన్న చర్చ వినిపిస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments