భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) భూషణ్ రామకృష్ణ గవాయ్ శుక్రవారం (జూన్ 27) జరిగిన ఓ కార్యక్రమంలో తన భావాలను పంచుకున్నారు. నాగ్పూర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలో అత్యున్నత న్యాయ పదవిని చేరుకున్నందుకు సీజేఐ గవాయ్ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రుల కృషి, పోరాట కథను వివరించారు. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కళ్లు చెమ్మగిల్లాయి. గొంతు మూగబోయింది. భావోద్వేగపూరిత మాటలు విని, అక్కడ ఉన్నవాళ్లు కూడా విచారంగా మారారు. తాను చిన్నతనంలో ఆర్కిటెక్ట్ కావాలని కోరుకున్నానని తెలిపారు. కానీ తన తండ్రి న్యాయవాది కావాలని కోరుకున్నట్లు తెలిపారు. ‘నా తండ్రి న్యాయవాది కావాలని కోరుకున్నారు. కానీ స్వాతంత్ర్య పోరాటంలో అరెస్టు కావడంతో ఆయన తన కలను నెరవేర్చుకోలేకపోయారని వెల్లడించారు.
తన కుటుంబం పడుతున్న ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. “మాది ఉమ్మడి కుటుంబం.. చాలా మంది పిల్లలు ఉండే వారు. బాధ్యత అంతా నా తల్లి, అత్త భుజాలపై ఉండేది. నా తండ్రి కలను నెరవేర్చడానికి.. ఆర్కిటెక్ట్ కావాలనే నా ఉద్దేశ్యాన్ని వదులుకుని, న్యాయవాద మార్గాన్ని ఎంచుకున్నాను. హైకోర్టు న్యాయమూర్తిగా నన్ను నియమించినప్పుడు.. ‘నువ్వు న్యాయవాదిగా కొనసాగితే, డబ్బు వెంట మాత్రమే పరిగెత్తుతారు. కానీ న్యాయమూర్తిగా మారితే.. అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరిస్తావు. సమాజానికి మంచి పని చేస్తావు’ అని నా తండ్రి చెప్పారు. నేను ఏదో ఒక రోజు భారత ప్రధాన న్యాయమూర్తి అవుతానని నా తండ్రి నమ్మాడు. అయితే, ఆయన 2015లో మరణించారు. ఈ రోజు ఆయన కల నెరవేరింది. కానీ ఇది చూసేందుకు ఆయన లేరు. నా తల్లి మాత్రం నా ఎదుగుదలను చూస్తున్నందుకు సంతోషిస్తున్నాను.” అని సీజేఐ భావోద్వేగానికి గురయ్యారు.!