గ్రేటర్ విశాఖ ప్రజలకు తాత్కాలిక ఊరట లభించింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కాంట్రాక్ట్ వాటర్ వర్కర్స్ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన చర్చలలో జీవీఎంసీ గడువు కావాలని కోరింది. వర్కర్స్ డిమాండ్లను బుధవారం లోపు నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. జీవీఎంసీ మాట తప్పితే.. శుక్రవారం నుంచి తిరిగి నిరవధిక సమ్మెకు వెళతాం అని యూనియన్లు హెచ్చరించాయి..తాత్కాలిక సమ్మె విరమణతో కాంట్రాక్ట్ ఉద్యోగులు తిరిగి విధులకు హాజరుకానున్నారు. సిబ్బంది మొత్తం తమ తమ డ్యూటీలలో చేరేందుకు సిద్దమయ్యారు. పంపింగ్, డిస్ట్రిబ్యూషన్కు సమయం పట్టే అవకాశం ఉంది. మంచినీటి సరఫరా పునరుద్ధరణకు నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టనుంది. మేయర్ పీలా శ్రీనివాసరావు సమక్షంలో శుక్రవారం జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. రెండోరోజు చర్చలు సఫలం అయ్యాయి. విషయం తెలిసిన విశాఖ ప్రజలు ఆనందపడిపోతున్నారు. ఈరోజు సాయంత్రానికి నీరు అందనుంది.పంపింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు కార్మికులు విధులు బహిష్కరించి.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల నిరవధిక సమ్మె కారణంగా విశాఖలోని మూడు లక్షల ఇంటి కులాయిలు సహా పలు కీలక పరిశ్రమలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దాదాపు 30 గంటలుగా పంపింగ్ ప్రక్రియ స్థంభించిపోవడంతో పలు కాలనీల ప్రజలు మంచినీటి కోసం తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకున్న జీవీఎంసీ.. కార్మికుల డిమాండ్లకు ఒప్పుకుంది. త్వరలోనే డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చింది.