మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నానిపై రకరకాల ప్రచారాలు సాగాయి.. చివరకు ఆయన్ను అరెస్ట్ చేశారని.. రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారనే పుకార్లు కూడా షికార్లు చేశాయి.. దాంట్లో నిజం లేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడలో ప్రత్యక్షమయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని.. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు హాజరయ్యారు.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదు కాగా.. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కొడాలి నాని.. అయితే, కింద కోర్టులో బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో.. ష్యూరిటీ పత్రాలు సమర్పించేందుకు ఇవాళ గుడివాడ కోర్టుకు హాజరయ్యారు కొడాలి నాని..
అయితే, ఈ కేసులో బెయిల్పై ఇప్పటికే 16 మంది కొడాలి నాని అనుచరులు విడుదలయ్యారు.. అయితే, పోలీసు కస్టడీలో కొడాలి నాని చెబితేనే దాడి చేసినట్లు అంగీకరించారట పలువురు అనుచరులు.. ఇక, చాలా కాలం తర్వాత గుడివాడలో కనిపించారు కొడాలి నాని.. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏడాది తర్వాత గుడివాడలో బహిరంగంగా కొడాలి నాని కనిపించడం ఇదే తొలిసారి అంటున్నారు.. ఇక, కొడాలి నాని రాకతో కోర్టు వద్దకు చేరుకున్నారు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..