సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో ఈ కేసులో జగన్ తో కేసు నమోదు చేసిన వైసీపీ నేతల పైన ఎలాంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు విచారణను వచ్చే మంగళవారానికి కోర్టు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో, హైకోర్టు
లో విచారణ తరువాత కోర్టు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఈ కేసులో పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
జగన్ క్వాష్ పిటీషన్
సింగయ్య మృతి కేసులో నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగన్ ను ఏ-2గా చేర్చారు. దీంతో, జగన్ తో పాటుగా ఈ కేసులో ఉన్న వైసీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. తమపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. ఈ కేసు తొలుత గురువారం కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సమయంలో అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. మొదటిసారి విచారణకు వచ్చాయని.. తనతోపాటు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తారని.. కేసు డైరీ, ఇతర వివరాలు తెప్పించుకోవలసి ఉందని తెలిపారు. వ్యాజ్యాలపై సోమవారం లేదా మంగళవారం విచారణ చేపట్టాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్రెడ్డి తో సహా ఇతర న్యాయవాదులు పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్లకు వర్తించవన్నారు.
చర్యలు వద్దు
పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారనే ఆందోళన ఉందని తెలిపారు. వివరాలు తెప్పించుకునేందుకు ఏజీ సమయం కోరుతున్నందున అరెస్టు నుంచి పిటిషనర్లకు రక్షణ కల్పించాలని కోరారు. తొందరపాటు చర్యలు తీసుకోబోమని ఏజీ హామీ ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు. దమ్మాలపాటి జోక్యం చేసుకుంటూ.. క్వాష్ పిటిషన్ ద్వారా అరెస్టు నుంచి రక్షణ కోరలేరని, ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారని పిటిషనర్లకు ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకుని ఉండాల్సిందన్నారు.
పోలీసులకు ఆదేశం
ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా, ఈ రోజు విచారణకు మంగళవారం కు వాయిదా వేసిన న్యాయమూర్తి.. జగన్ తో సహా పిటీషన్లు దాఖలు చేసిన నేతల పైన ఎలాంటి తొందర పాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించారు.