ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. వీటిని వివరించేందుకు తాజాగా ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో అమరావతిలో భారీ సభను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా హాజరయ్యారు.
అయితే ఈ సుపరిపాలనకు తొలి అడుగు సభలో ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ సభలో ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందని ఆయన చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ సభకు హాజరైన కలెక్టర్లు, ఎస్పీలు, ఎంపీలను ఓ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, ఎమ్మెల్యేలను మాత్రం మరో టేబుల్ దగ్గర కార్పోరేషన్ డైరెక్టర్లతో కలిపి కూర్చోబెట్టారని రఘురామ వాపోయారు.దీనిపై ఎమ్మెల్యేలు తనకు ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామ తెలిపారు. ఈ కార్యక్రమానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను ఆహ్వానించాల్సి ఉన్నా అలా జరగలేదన్నారు. ఒకవేళ తాను ఈ సభకు వెళ్లి ఉంటే సీటింగ్ చూసి బయటికి వచ్చేసే వాడిని అంటూ రఘురామ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆయన ఆరోపించారు. ఇది సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలిసి జరిగిందో లేదో తనకు తెలియదన్నారు.
కలెక్టర్ కంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ పెద్దదని ఆయన గుర్తుచేశారు. సుపరిపాలనకు తొలి అడుగు సభలో ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై తాను సీఎస్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. దీన్ని మొదటి తప్పుగా భావిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామ వెల్లడించారు.