ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా శ్రీశైలం పేరుగాంచింది. భక్తులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ఆలయం వద్ద బుల్లెట్లు, బాంబులు లభ్యమవ్వడం రాష్ట్రవ్యాప్తంగా భయాందోళన కలిగించింది. సోమవారం నాడు ఈ ఘటన చోటు చేసుకోగా.. ఓ సంచిలో బుల్లెట్లు, బాణసంచా బాంబులు, ఎర్రటి గుడ్డ ఉండడం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటనలో మిస్టరీ వీడింది. అవి పోలీసు శాఖకే చెందినవని.. ఇది అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన తప్పిదమని ఆత్మకూర్ డీఎస్పీ రామాంజినాయక్ స్పష్టం చేశారు.
ఎక్కడ దొరికాయంటే? శ్రీశైలంలోని ప్రసిద్ధ వాసవీ సత్రం ఎదురుగా ఉన్న రోడ్డుపై, డివైడర్లో మొక్కల మధ్య ఓ అనుమానాస్పద సంచి సోమవారం కనిపించింది. నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు ఈ సంచిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్ను పిలిపించి స్థానిక భద్రతను కట్టుదిట్టం చేసి సంచి తమ ఆధీనం లోకి తీసుకున్నారు. అందులో నుంచి SLR, 303, పిస్టల్ రౌండ్లతో పాటు, నాలుగు వంకాయ బాంబుల తరహా బాణసంచా బాంబులు లభించాయి. అలానే ఒక ఎర్రటి వస్త్రం కూడా ఆ సంచిలో ఉన్నట్టు గుర్తిం
సంబంధిత ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ సంచి 1983 బ్యాచ్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఎల్లప్పదిగా తేలింది. ఎల్లప్ప ప్రస్తుతం శ్రీశైలంలో డ్యూటీలో ఉండగా, తనకు అప్పగించిన బుల్లెట్లు, సాధారణ బాణసంచా బాంబులు కలిపి ఓ సంచిలో పెట్టుకుని తీసుకువచ్చాడని అన్నారు. అయితే ఫోన్లో మాట్లాడుతూ రోడ్డుపై ఉన్న డివైడర్లో ఆ సంచిని మరిచిపోయాడని.. ఆ తెలిసినా, ఎల్లప్ప భయంతో దాన్ని అధికారులకు తెలియచేయకుండా మౌనంగా ఉండిపోయాడని వివరించారు.
అంతే కాకుండా ఎల్లప్పకు జాతకాల మీద ఉన్న నమ్మకంతో సంచిలో ఎర్రటి వస్త్రం కూడా పెట్టుకున్నాడని తెలిపారు. ఎల్లప్ప ఈ నెలాఖరులో రిటైర్ అవుతున్నారని.. ఇదంతా పూర్తిగా నిర్లక్ష్యం కారణం గానే జరిగిందని చెప్పారు. అయితే అత్యంత ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రం వద్ద భద్రతా విభాగానికి చెందిన వ్యక్తి నుంచే ఈ తరహాగా నిర్లక్ష్యంగా ఉండడం తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.