అమ్మ దైవంతో సమానం. నవమోసాలు కని పెంచి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చినా విలవిల్లాడిపోతుంది. అలాంటి కన్న తల్లులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. కానీ, ప్రస్తుత రోజుల్లో కొంతమంది తల్లులను చూస్తుంటే.. కంటేనే అమ్మాని అంటే ఎలా.. కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా.. రాతి బొమ్మే కదా అని అనాల్సిన పరిస్థితి దాపరించింది. అమ్మతనానికే మాయని మచ్చగా తయారవుతున్నారు కొందరు తల్లులు. పరాయి వ్యక్తుల మోజులో పడి కన్న బిడ్డలను సైతం చంపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ప్రియుడితో హనీమూన్కు వెళ్లేందుకు ఇద్దరు పిల్లలను చంపేసింది ఓ కసాయి తల్లి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ ప్రాంతం రోడ్కాలి గ్రామానికి చెందిన ముస్కాన్ (24) అనే మహిళకు అర్హాన్ (5), ఇనాయ(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త వసీం జీవనోపాధి కోసం చండీగఢ్ లో నివసిస్తుండడంతో, జునైద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ముస్కాన్. జునైద్తో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని, అడ్డుగా ఉన్న పిల్లలను విషమిచ్చి హతమార్చింది తల్లి. పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో ఈ మరణాలలో తల్లి ప్రమేయం ఉందని తేలింది. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, ఆమె నేరం అంగీకరించింది అని అధికారి తెలిపారు. తన ప్రేమికుడు జునైద్తో కొత్త జీవితాన్ని ప్రారంభించడంలో తన పిల్లలు అడ్డంకిగా ఉన్నారని, అందుకే వారిని చంపాలని నిర్ణయించుకున్నానని ముస్కాన్ చెప్పిందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు పిల్లలను చంపిన తర్వాత ఆ జంట “హనీమూన్” కి వెళ్లాలని ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. కొంత కాలం క్రితం సంగారెడ్డిలోని అమీన్ పూర్ కు చెందిన ఓ మహిళ తన టెన్త్ క్లాస్ ప్రియుడితో కలిసి బ్రతికేందుకు కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను చింపేసిన విషయం తెలిసిందే.