జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగరతీరం ముస్తాబయింది. యోగాంధ్ర 2025 కోసం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిమీ మేర వేదికలు సిద్ధం చేశారు. అన్ని వేదికలలో మ్యాట్లు, విద్యుద్దీపాలు, ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. రికార్డు స్థాయిలో ఒకేచోట 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ వర్షం పడితే.. కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ఆంధ్ర వర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక కూడా సిద్ధంగా ఉంది.
జూన్ 21న ఉదయం 6.25 గంటలకు యోగాంధ్ర 2025 కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఉదయం 6.30 నుంచి 7 గంటల వరకు అతిథులు ప్రసంగించనున్నారు. 6.30 నుంచి 6.45కు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి, ఏపీ ఉపముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని 15 నిమిషాలు ప్రసంగించనున్నారు. ఇక 7 గంటలకు ఆసనాలు ప్రారంభించి.. 7.45 వరకు నిర్వహిస్తారు. దాంతో యోగాంధ్ర 2025 ముగుస్తుంది. యోగాంధ్ర 2025 నేపథ్యంలో నేడు విశాఖ నగరానికి వీవీఐపీల తాకిడి ఉంటుంది.
ఇంటర్నేషనల్ యోగా డే కోసం సాయంత్రం విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోనున్నారు. సాయంత్రం 6.40 గంటలకు ప్రత్యేక విమానంలో నగరానికి ప్రధాని చేరుకుంటారు. ఇప్పటికే నగరంలో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.30 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఐఎన్ఎస్ డేగాకు వెళ్లి.. ప్రధానికి స్వాగతం పలుకుతారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సాయంత్రం 4 గంటలకు విశాఖ చేరుకుంటారు. ప్రధాని మోడీ స్వాగత కార్యక్రమాల్లో పాల్గొని పోర్టు అతిథి గృహానికి వెళ్తారు. మంత్రి నారా లోకేశ్ ఉదయం 10 గంటలకు విశాఖ చేరుకుంటారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేస్తారు.