పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరికాసేపట్లో చేరుకోనున్నారు. పోలీసుల వేధింపులతో గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని వైసీపీ అధినేత ఆవిష్కరించనున్నారు. పల్నాడు జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రజలు జగన్కు నీరాజనాలు పలుకుతున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్కు గుంటూరు నగరంలో ప్రతిచోటా అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగునా స్వాగతం పలికేందుకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చారు. ‘జయహో జగన్’ అంటూ నినదించారు. దాంతో గుంటూరులోకి ఎంటరై గంటన్నర అవుతున్నా.. జగన్ కాన్వాయ్ ముందుకు సాగడం లేదు. జగన్ కాన్వాయ్ వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గుంటూరు వై జంక్షన్, ఏటుకూరు రోడ్, లాల్పురం రోడ్డు మీదుగా చుట్టుగుంట మీదుగా జగన్ కాన్వాయ్ ముందుకు సాగింది. మహిళలు, పార్టీ కేడర్తో రోడ్లన్నీ నిండిపోయాయి. చుట్టుగుంట సెంటర్లో జగన్కు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘన స్వాగతం పలికారు. మొత్తంగా అభిమానులు, కార్యకర్తలతో గుంటూరు రోడ్లు కిటకిటలాడాయి.సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు వైఎస్ జగన్కు స్వాగతం పలికాయి. బస్టాండ్ నుంచి ఐదు లాంతర్ల సెంటర్ వరకు పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిలో సైరన్ మోగిస్తూ.. బైక్లపై నిలుచొని యువకులు హడావుడి చేశారు. జగన్ అందరికి అభివాదం చేస్తూ ముందుకు సాగరు. జై జగన్ నినాదాలతో జన సందోహంగా సత్తెనపల్లి రోడ్లన్నీ మారాయి. ఇక వైఎస్ జగన్ పర్యటనకు ఆయన కాన్వాయ్తో పాటు మూడు వాహనాలు, వంద మందికి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు.