ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన తల్లికి వందనాన్ని తాజాగా అమలు చేసింది. ఏడాది లేటుగా అమలు చేస్తుందన్న విమర్శల్ని పక్కనబెడితే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంత మందికీ ఈ పథకం డబ్బులు ఇస్తామన్న హామీ మాత్రం పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ అరుదైన రికార్డు ఘటనను తెలుగు దేశం పార్టీ తమ ఎక్స్ హ్యాండిల్ లో పోస్టు చేసింది.
ఇప్పటికే విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గం పులివెందులలో సైతం తల్లికి వందనం అమలు చేస్తున్న తీరుపై పలు వీడియోలు పోస్ట్ చేస్తున్న టీడీపీ.. తాజాగా అన్నమయ్య జిల్లాల్లో ఒకే కుటుంబంలో ఏకంగా 12 మంది పిల్లలకు ఈ పథకం డబ్పులు పడ్డాయన్న సమాచారంతో పాటు వీడియోను సైతం పోస్టు చేసింది. ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు తల్లులు ఉండటం వారికి మొత్తం 12 మంది పిల్లలు ఉండటంతో వారందరికీ ఈ పథకం లబ్ది చేకూరింది.
అన్నమయ్య జిల్లా కలకడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులకు, వారి 12 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయని టీడీపీ తమ హ్యాండిల్ లో వీడియో పోస్టు చేసింది. ఒకేసారి రూ.1.56 లక్షలు తమ అకౌంట్ లో పడటంతో, ఆ కుటుంబం, ఆ తల్లుల సంతోషానికి అవధులు లేవని తెలిపింది. ఇదే తరహాలో రాష్ట్రంలో పలు చోట్ల ఒకే కుటుంబాల్లో తల్లికి వందనం పథకం డబ్బులు తీసుకున్న వారి వీడియోల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. వీటికి మంచి స్పందన లభిస్తోంది.