రానురాను వివాహ బంధానికి విలువ లేకుండా పోతోంది. అప్పటికే పెళ్లై పిల్లలున్నవారు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబాలను రోడ్డున పడేసుకుంటున్నారు. తమకిష్టమైన వ్యక్తితో కలిసి ఉండేందుకు కట్టుకున్న వారిని కాటికి పంపిస్తున్నారు. కాగా కొందరు భర్తలు తమ భార్యల ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు తెలుసుకుని అతగాడికిచ్చి పెళ్లి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని అమేథి జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లైన 13 ఏళ్లకు భార్య ప్రేమ వ్యవహారం బయటపడింది. దీంతో ఆమె భర్త ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. సొంత భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.ఈ ఘటన అమేథి జిల్లాలోని జామో పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పురే బాల్ గోవింద్ తివారీ మౌజాకు చెందిన దరియావ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంత నివాసి అయిన సతాయ్, అదే జిల్లాలోని మోహన్గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కుట్మారా గ్రామానికి చెందిన రామ్ ప్రసాద్ కుమార్తె సీమాను 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహానికి ముందు, సీమాకు శివానంద్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉండేది. వివాహం అయిన 13 సంవత్సరాల తర్వాత కూడా వారి ప్రేమ కొనసాగుతూనే ఉంది.
ఎప్పటికైన అక్రమ సంబంధం బయటపడాల్సిందే కద. ఈ క్రమంలో వారం క్రితం, సతాయ్ తన భార్య సీమాను ఆమె ప్రేమికుడితో కలిసి ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. వారి మీద కక్ష తీర్చుకోవడానికి బదులుగా వారిద్దరికి పెళ్లి చేయడమే బెటర్ అని భావించాడు. తిలోయ్ తహసీల్కు వెళ్లి కోర్టులో వారి వివాహం జరిపించాడు. ఆ తర్వాత ప్రేమికుడు శివానంద్ తన ప్రియురాలిని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.