అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్న జేఎన్ ఫార్మా సిటీలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి సాయిశ్రేయాస్ (ఎస్.ఎస్) ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం సంభవించింది. కంపెనీలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద ఈ ఘటన జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిల్వ చేసిన కెమికల్స్ లెవెల్స్ను చెక్ చేయడానికి ముగ్గురు కార్మికులు వెళ్లారు. ఈ సమయంలో మ్యాన్హోల్ను ఓపెన్ చేయడంతో ప్రమాదవశాత్తూ తీవ్ర విషపూరిత వాయువులు బయటకు విడుదలయ్యాయి. దీనివల్ల అక్కడి పని చేస్తున్న ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఈ విషవాయువులను పీల్చిన ముగ్గురిలో ఇద్దరు చికిత్స పొందుతున్న సమయంలో కోలుకోలేక మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషయంగా ఉంది. మృతి చెందిన వారిని పరిమి చంద్రశేఖర్ (సేఫ్టీ మేనేజర్, తెలంగాణ), సరగడం కుమార్ (సేఫ్టీ ఆఫీసర్, మునగపాక, అనకాపల్లి) గా గుర్తించారు. మరో కార్మికుడు బైడూ భైసాల్ (హెల్పర్, బోడెన్, ఒడిశా) పరిస్థితి విషయమించడంతో ఆయనను చికిత్స నిమిత్తం విశాఖపట్నం షీలానగర్లోని ఆసుపత్రికి తరలించారు.
పరవాడ సీఐ మల్లికార్జునరావు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల దేహాలను విశాఖ కేజీహెచ్ మార్చురీకి తరలించారు. పరిశ్రమ భద్రతా ప్రమాణాలపై ఇప్పటికే అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ ఘటన మరింత చర్చకు దారితీస్తోంది. ఈ ప్రమాదం ప్రధాన పరిశ్రమలో కాకుండా ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే కెమికల్ హ్యాండ్లింగ్, సేఫ్టీ ప్రోటోకాల్లపై పరిశ్రమ యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.