సీఎం చంద్రబాబు కితాబు
జయజయహే : బ్రిటిష్ ఇరిగేషన్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఈమేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను సర్ ఆర్థర్ కాటన్ నిర్మించారని చెప్పారు. కాలువలు నిర్మించి, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి సర్ ఆర్థర్ కాటన్ కృషి చేశారని అన్నారు. ఆయన చేసిన సేవలను ఎవరూ మర్చిపోలేరని కొనియాడారు. ఒక వ్యక్తి తలచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో కాటన్ మహశయుడు రుజువు చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలను పాలకొల్లులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయడు నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఆనాడు ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం ఆనకట్టతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు ఎంతో కృషి చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు. గత జగన్ ప్రభుత్వ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసంతో కాటన్ దొర ఆత్మ సైతం క్షోభిస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టులు, కాలువల పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా శ్రమిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పంట కాలువలు, మురుగు డ్రైన్ల మెయింటనెన్స్ పనులకు సీఎం చంద్రబాబు రూ.344 కోట్లను కేటాయించారని తెలిపారు. త్వరలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయబోతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు.