వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు అయింది. విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు మంగళవారం వంశీకి బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ దక్కింది. వంశీతో పాటు మరో నలుగురికి ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. వల్లభనేని వంశీని 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిబ్రవరి 13, 2025న హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్షిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ బెదిరించి, కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించాడని ఆరోపణలు వచ్చాయి. సత్యవర్ధన్ మొదట కోర్టులో తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పాడు.
అయితే, తర్వాత పోలీసులను ఆశ్రయించి వల్లభనేని వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించాడని ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా వల్లభనేని వంశీపై కిడ్నాప్, బెదిరింపు, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన కేసులో వంశీకి బెయిల్ వచ్చింది.గన్నవరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా కిడ్నాప్ కేసులో కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13న వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు మూడు నెలల తర్వాత ఆయన బెయిల్పై బయటకు రానున్నారు.