కింజరాపు కుటుంబం దోపిడీ విధానాలను, అరాచక పాలన ప్రజలకు తెలియజేయండి
అనుబంధ సంఘాల అధ్యక్షులకు తిలక్ పిలుపు
జయజయహే : మైనింగ్ లిక్కర్ మాఫియా తో కింజరాపు అచ్చన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కుటుంబం ప్రజాధనాన్ని దోచుకుంటుందని వైఎస్ఆర్సిపి టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ పేరాడ తిలక్ ఆరోపించారు. సోమవారం టెక్కలి వైయస్సార్ సిపి కార్యాలయంలో నియోజకవర్గ, మండల స్థాయి అనుబంధ విభాగాల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి సానుభూతిపరులు కు చెందిన క్రషర్లను మూసి వేయించి కూటమి ప్రభుత్వంకు అనుకూలంగా ఉన్న వారితో అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు చేపడుతూ వారి వద్ద నుంచి కోట్ల రూపాయలు కమిషన్లు గుంజుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో కింజరాపు కుటుంబం, తమ అనుచరులు మద్యం వ్యాపారం చేస్తూ గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు నిర్వహించడంతోపాటు అక్రమంగా ఒరిస్సాలో తయారైన మధ్యాన్ని విక్రయిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో టెక్కలి రౌడీయిజం పెచ్చమీరుతోందని, యువతను అధిక వడ్డీలకు ప్రేరేపిస్తూ అప్పుల పాలు చేయించి గంజాయికి,డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ అరాచక విధానాలను, అరాచక పాలన గురించి ప్రజలకు తెలియపరిచి చైతన్యపరచాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ సందర్భంగా పహల్గమ్ దాడిలోను, కాశ్మీర్ సరిహద్దుల్లో జరుగుతున్న యుద్ధంలో మృతి చెందిన భారతీయుల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందిగా, టెక్కలి, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి మండలాల ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.