Tuesday, June 17, 2025
Homeinternationalఅమెరికా ఒత్తిడికి ఇందిరా గాంధీ డోంట్ కేర్..

అమెరికా ఒత్తిడికి ఇందిరా గాంధీ డోంట్ కేర్..

పాకిస్థాన్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోబోమన్న అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌

అమెరికా మాకు యజమాని కాదని తెగేసి చెప్పిన ఇందిర

1971 యుద్ధం సమయంలో.. ఆసక్తికర సంఘటన

జయజయహే : దాదాపు 52 సంవత్సరాల క్రితం.. 1971 మార్చిలో తూర్పు పాకిస్థాన్‌(నేటి బంగ్లాదేశ్‌)పై పాక్‌ అధ్యక్షుడు ‘ఆపరేషన్‌ సెర్చ్‌లైట్‌’ పేరుతో దారుణ మారణకాండ సాగిస్తున్నప్పుడు బంగ్లాదేశ్‌కు అండగా భారత్‌ నిలిచిన సంగతి తెలిసిందే. తమ అనుంగు మిత్రుడైన పాక్‌ విషయంలో భారత్‌ జోక్యం చేసుకోవడం అమెరికాకు నచ్చలేదు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌… పాకిస్థాన్‌కు అండగా రంగంలోకి దిగారు. పాక్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ తీవ్రస్థాయిలో భారత్‌పై ఒత్తిడి తెచ్చారు. కానీ, ఆ ఒత్తిడికి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తలొగ్గలేదు. 1971 నవంబరులో ఆమె అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు.. వైట్‌హౌ్‌సలో నిక్సన్‌తో భేటీ అయ్యారు. ‘‘భారతదేశం పాకిస్థాన్‌ విషయాల్లో జోక్యం చేసుకుంటే అమెరికా చేతులు ముడుచుకుని కూర్చోదు. భారతదేశానికి తగిన గుణపాఠం చెబుతుంది’’ అని రిచర్డ్‌ నిక్సన్‌ ఆధిపత్య ధోరణిలో మాట్లాడారు. అప్పుడు ఇందిరాగాంధీ ఆయనకు దీటుగా సమాధానం చెప్పారు. ‘‘అమెరికాను భారతదేశం స్నేహితుడిగానే చూస్తోంది తప్ప యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని రాసుకోగల శక్తి భారతదేశానికి ఉంది. పరిస్థితులకు అనుగుణంగా ఎవరితో ఎలా వ్యవహరించాలో భారత్‌కు తెలుసు.’’ అని నిక్సన్‌ కళ్లల్లోకి కళ్లు పెట్టి సూటిగా చూస్తూ, తెగేసి చెప్పి అక్కణ్నుంచి లేచి బయటకు వచ్చేశారు. ఈ ఘటనను.. నాటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌ తన ఆత్మకథలో కళ్లకు కట్టినట్టు రాశారు. అనంతర కాలంలో పాక్‌కు అమెరికా 270 యుద్ధ ట్యాంకులను పంపింది. వాటిని అత్యంత అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేశామని.. వాటిని ధ్వంసం చేయడం అసాధ్యమని.. ప్రపంచ మీడియా ముందు గొప్పలు చెప్పుకొంది. తద్వారా.. ప్రపంచంలో ఏ దేశమూ భారత్‌కు సాయం చేయడానికి వీల్లేదనే సంకేతాన్ని పరోక్షంగా పంపింది. ఎన్నిచేసినా.. బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధంలో భారత విజయాన్ని ఆపలేకపోయింది.

అమెరికా వ్యతిరేకించినా ఐఎంఎఫ్‌ రుణం తెచ్చిన ఇందిర

1981 ఘటనను గుర్తు చేసిన కాంగ్రెస్‌

పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) రూ.8,500 కోట్లు(బిలియన్‌ డాలర్లు) రుణం ఇచ్చేందుకు అంగీకరించిన నేపథ్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1981లో సాధించిన ఓ ఘనతను కాంగ్రెస్‌ ప్రజలకు గుర్తు చేసింది. అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఇందిరా గాంధీ ఐఎంఎఫ్‌ నుంచి 5.8 బిలియన్‌ డాలర్ల రుణం సాధించిన సంగతిని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘భారత్‌కు 5.8 బిలియన్‌ డాలర్లు రుణం ఇచ్చేందుకు 1981 నవంబరు 9న ఐఎంఎఫ్‌ ఆమోదం తెలిపింది. దీన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశానికి కూడా దూరంగా ఉంది. కానీ, చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్న ఆ సమయంలో భారత్‌కు అత్యంత అవసరమైన ఈ రుణాన్ని ఇందిరా గాంధీ ఐఎంఎఫ్‌ నుంచి సాధించారు. ఇక, 1984 ఫిబ్రవరి 29న ప్రణబ్‌ ముఖర్జీ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నప్పుడు.. భారత్‌ ఐఎంఎఫ్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించిందని, ఐఎంఎఫ్‌ దేశానికి ఆమోదించిన రుణంలో 1.3 బిలియన్‌ డాలర్లను తీసుకోవడం లేదని ప్రణబ్‌తో ఇందిర ప్రకటన చేయించారు’’ అని జైరాం రమేశ్‌ పోస్టు చేశారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments