ఉగ్రదాడి, కాల్పుల విరమణపై స్పష్టతనివ్వాలి
పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలి
ప్రధాని మోడీకి విపక్ష నేత రాహుల్ లేఖ
జయజయహే : విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి సంచలన చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ ప్రకటనలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై దేశ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు పూర్తి సమాచారం అందాలన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ”పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని విపక్షాల తరఫున కోరుతున్నాను. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం ఉంది. కాల్పుల విరమణను మొదటగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దానిపై కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అలాగే రాబోయే సవాళ్లు ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాల్సిన సమయం ఇది. నేను చేసిన డిమాండ్ను మీరు అంగీకరిస్తారని భావిస్తున్నానని” రాహుల్గాంధీ లేఖలో తెలిపారు. మరోవైపు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా పహల్గాం ఉగ్రదాడిపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరుతూ రాసిన లేఖను కూడా రాహుల్ గాంధీ గుర్తుచేశారు. అమెరికా, భారత్ నుంచి వచ్చిన కాల్పుల విరమణ ప్రకటనలతో ఈ మీటింగ్ అవసరమని చెప్పారు. అయితే దీనిపై బీజేపీ హైకమాండ్ ఇంతవరకు ఏమీ స్పందించలేదు.