మూడు రోజులు కురిసే ఛాన్స్
27న రుతుపవనాల రాక
జయజయహే : ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో తిరుపతి, కడప, అనంతపూర్ వంటి జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, తాండూరు, మెదక్, నారాయణఖేడ్, వికారాబాద్, మేడ్చల్, బాల్కొండ, జగిత్యాలలో కూడా వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా మే 27నే రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత దేశమంతటా వర్షాలు కురవడం మొదలవుతాయి. జులై 8 నాటికి ఈ రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయి. మళ్లీ నార్త్వెస్ట్ భారత్ నుంచి సెప్టెంబర్ 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలవుతుంది. అక్టోబర్ 15 నాటికి ఇది ముగుస్తుంది. అయితే ఈసారి జూన్ 1 కంటే ముందుగానే మే 27న నైరుతి రుతుపనవాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2024లో మే 30న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. 2023లో జూన్ 8న, 2022లో మే 29న ప్రవేశించాయి. మరోవైపు ఈసారి వర్షకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యో ఛాన్స్ ఉందని వాతావరణశాఖ చెప్పింది. ఇదిలా ఉండగా భారత్లో 52 శాతం నికర సాగు భూమికి వర్షపు నీరే ప్రధాన ఆధారం. దేశం మొత్తంగా చూసుకుంటే ఈ సాగు భూమి నుంచే 40 శాతం దిగుబడి వస్తుంది. అందుకోసమే నైరుతి రుతుపవనాలు అనేవి ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో కీలక పాత్ర పోషిస్తాయి.