Tuesday, June 17, 2025
HomeBlogసమగ్ర ప్రాంతీయ అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం - వడ్డే శోభనాద్రీశ్వరరావు

సమగ్ర ప్రాంతీయ అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం – వడ్డే శోభనాద్రీశ్వరరావు

జయజయహే : 26 జిల్లాల సమగ్రాభివృద్ధి తోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమౌతుందని, రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గత మూడు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు కేటాయించి సత్వరమే పూర్తిచేయాలని ప్రముఖ రాజ నీతిజ్ఞులు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీ శనివారం గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి పై జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షతన జన చైతన్య వేదిక హాలులో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయడానికి అధికార పార్టీలు, ప్రధాన ప్రతిపక్షం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే స్థితిలో లేవన్నారు. నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా 80 వేల కోట్లతో పోలవరం – బనకచర్ల భారీ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకొని వస్తున్నారని, ఇది ఆంధ్రప్రదేశ్ కు గుదిబండగా మారనుందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది బలిదానాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరమైన బొగ్గు గనులను కేటాయించక పోవడం వలన నష్టాలకు గురి అవుతుంటే, మరోవైపు ప్రైవేటు రంగంలో ఆర్సేలర్ మిట్టల్ కు ఎర్ర తివాచి పరచి స్టీల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చి, బొగ్గు గనులు కేటాయించడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని పేరుతో 58వేల ఎకరాలు సేకరించి, నేడు మరో 44 వేల ఎకరాల సాగు భూములను రైతుల నుండి తీసుకొని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద రాజధానిగా నిర్మించాలని పగటి కలలు కంటుందని, దీనికోసం కనీసం లక్ష కోట్లు అప్పులు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీకి 83కీ.మీ చెన్నై, బెంగళూరు లకు 62 కీ.మీ మేర ఓటర్ రింగ్ రోడ్ లు ఉండగా, కేవలం లక్ష జనాభా మాత్రమే ఉన్న అమరావతికి 197 కీ. మీ అవుటర్ రింగ్ రోడ్ నిర్మించ తలపెట్టడం ప్రజాధనాన్ని వృధా చేయడమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన నిర్ణయాలు సంబంధిత మేధావులు, నిపుణులతో సంప్రదించకుండానే ఏక పక్షంగా చేస్తుందని, మూగ ప్రజలు, చెవిటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయలేవన్నారు. చైతన్య, నారాయణ, భాష్యం లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో 10శాతం మేర ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలని కోరారు. మహారాష్ట్రల్లో 167, ఉత్తర ప్రదేశ్ లో 116, కర్ణాటకలో 75 షుగర్ ఫ్యాక్టరీలు ఉండగా మన రాష్ట్రంలో కేవలం 5 మాత్రమే ఉండడం చేదు వాస్తవమన్నారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ గత ప్రభుత్వంలో వేలాది కోట్ల రూపాయలు అవినీతి చేసిందని బహిరంగంగా మాట్లాడి, హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన నేటి పాలకులు మరలా షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ చేతిలో విద్యుత్ రంగాన్ని పెట్టడం దారుణమన్నారు. గతంలో 8 వేలు విలువచేసే స్మార్ట్ మీటర్లను 36 వేలకు కేటాయించడం, ట్రాన్స్ఫార్మర్లను కూడా రెట్టింపు ధరలకు ఇచ్చి జగన్ ప్రభుత్వం దోపిడీ చేస్తే నేడు కూటమి ప్రభుత్వం అదే త్రోవలో పయనిస్తుందని అవహేళన చేశారు. సభకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ దక్షిణ భారతదేశంలో అతి తక్కువ తలసరి ఆదాయం కలిగి,అక్షరాస్యతలో 32వ స్థానంలో ఉండి, ప్రతి నెలా 6వేల కోట్ల రూపాయల వడ్డీలు చెల్లిస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా గత 11 నెలల్లో మరో లక్ష 50 వేల కోట్లు అప్పులు చేసి అనుత్పాదక రంగాలకు ఖర్చు చేయడం అవివేకమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి వ్యవసాయరంగ ప్రాధాన్యతే ముఖ్యమని, జల వనరులను సద్వినియోగం చేసుకొని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగి, సంపద, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. పాలకులు నీటిపారుదల ప్రాజెక్టులను అవినీతి పారుదల ప్రాజెక్టులుగా మార్చినారన్నారు. ఫీజు రీయబర్స్మెంట్ అమలు చేయలేకపోవడం వలన వేలాది పేద విద్యార్థులు నష్టపోతున్నారని, ఆరోగ్య శ్రీ నిధులు సంబంధిత ఆసుపత్రులకు సకాలంలో చెల్లించకపోవడం వలన పేద రోగులు ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వందలాది కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి వేడుకలను, బహిరంగ సభలను నిర్వహించడం బాధ్యతా రాహీత్య మన్నారు. అమరావతిలో రాజధాని పేరుతో కి.మీ. రోడ్డుకు 64 కోట్ల రూపాయలు, ఒక చదరపు అడుగుకు పదివేల రూపాయలకు పైగా వెచ్చిస్తూ అనుయాయులకు లబ్ది చేకూరుస్తున్నారని విమర్శించారు. ప్రముఖ విద్యావేత్త ప్రొ.డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన నియోజక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోగలమని, నియోజక వర్గ, జిల్లాస్థాయిల్లో ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలన్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొ. ఎన్. వేణుగోపాలరావు ప్రసంగిస్తూ ప్రజలను జాగృతలను చేస్తేనే ప్రభుత్వాలు సక్రమంగా నడుస్తాయని, నది పరీవాహక ప్రాంతాలలో వ్యవసాయేతర కార్యక్రమాలు ఉండరాదని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం. ఎస్. స్వామినాథన్ సూచనను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మానవత చైర్మన్ పావులూరి రమేష్, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, రాజ్యాంగ చర్చావేదిక కన్వీనర్ అవధానుల హరి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments