జయజయహే : మన్యం దేవత గిరిజనుల కల్పవల్లి ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ తల్లి జాతర రాష్ట్ర స్థాయి గిరిజనోత్సవం ఘనంగా జరగనుంది . ప్రకృతి అందాలకు ఆలవాలం పాడేరు మన్యం ప్రాంతం. దట్టమైన అరణ్యం, పారే సెలయేర్లూ, ఎత్తైన కొండ శిఖరాలూ, పచ్చని చెట్లూ… ఇలా వన సౌందర్యానికి ఉదాహరణగా నిలిచే పాడేరులో గిరిజనుల దేవతగా కొలువుదీరి పూజలు అందుకుంటున్న మన్యం దేవత.. గిరిజనుల కల్పవల్లి.. కోరికలు తీర్చే కొంగు బంగారం… ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం.. పాడేరు మోదకొండమ్మ తల్లి. విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలోని పాడేరులో స్వయంభువుగా వెలసిన ఈ అమ్మవారు కోరిన కోర్కెలను తీర్చి సంతోషాన్ని ప్రసాదిస్తుందని ప్రతీతి. ఈ మన్యం దేవతకు ప్రతి సంవత్సరం మే నెలలో మూడు రోజులపాటు ప్రత్యేక జాతరను నిర్వహించి తమ శక్తికొలదీ మొక్కుల్ని చెల్లించుకుంటారు భక్తులు.అమ్మవారి మూడురోజుల ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతాయి . రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రెండవ అతి పెద్ద గిరిజన జాతర మోదకొండమ్మ జాతర. రాష్ట్ర విభజన అనంతరం మోదకొండమ్మ జాతర ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ స్థానంలో నిలిచింది. 2014వ సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి గిరిజనోత్సవం గా గుర్తింపు ఇచ్చి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాల కోసం భక్తులు భారీగా తరలి వస్తుంటారు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏ కోరికలు కోరుకున్న వెంటనే నెరవేరుతుందని భక్తుల అపార విశ్వాసం. నమ్మకం..! విశాఖ ఏజెన్సీలో పుట్టిన పిల్లలకు అమ్మవారి పేరు పెడతారు. అదే వ్యాపార రీత్యా కూడా అమ్మవారి పేరు పెట్టుకుంటారు. అమ్మవారిపై అంతటి నమ్మకం ఇక్కడ ప్రజలకు. పరవశించిపోయే ప్రకృతి మధ్య మోదకొండమ్మ దేవికి ఏటా మే నెలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 11 నుంచి మూడు రోజులపాటు అమ్మవారి జాతర నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఆదివారం అమ్మవారి ఆలయం నుండి బయలుదేరి శతకం పట్టు వద్దకు డప్పుల వాయిద్యాలతో అమ్మవారి విగ్రహం, పాదాలను ఊరేగింపుగా తీసుకువచ్చి శతకం పట్టు వద్ద ప్రతిష్టిస్తారు. మూడు రోజుల పాటు శతకం పట్టు వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించడం ఆనవాయితీ.రెండోవ రోజు యదవిదిగా పూజలు నిర్వహిస్తారు ఇక మూడోరోజు చివరి రోజు మోద కొండమ్మ అమ్మవారి జాతర ముగింపు ఉత్సవాల సందర్భంగా అనుపు ఉత్సవం కన్నుల పండవగా జరుగుతాది. అమ్మవారి ఘటాలను పురవీధుల్లో ఊరేగిస్తారు. శతకం పట్టు నుంచి అమ్మవారి విగ్రహం, పాదాలను ఆలయం వద్దకు తీసుకువచ్చి ఆలయంలో ఉంచుతారు అక్కడితో జాతర ముగుస్తుంది అంగరంగ వైభవంగా జరిగే ఈ జనజాతరకు సుదూర తీరాల నుంచి భక్తులు హాజరవుతారు. తెలంగాణా,ఒడిశా, ఛత్తీస్గఢ్ లాంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి, మేళతాళాలతో అమ్మవారి ఘటాలను నిలబెట్టి, ప్రత్యేక పూజలు చేశారు.రాష్ట్రంలోనే అతిపెద్ద పేరొందిన గిరిజన జాతర మోదకొండమ్మ జాతర. రాష్ట్ర ప్రభుత్వం 2014వ సంవత్సరం నుండి రాష్ట్ర జాతరగా గుర్తించి ప్రతి ఏటా నిధులు విడుదల చేస్తుంది. అల్లూరి జిల్లా పాడేరులో వెలసిన మోదకొండమ్మ అమ్మవారికి విశేష చరిత్ర ఉంది. మోదం అంటే సంతోషం.. గిరుల్లో వెలసిన దేవత కొండమ్మ. మోద కొండమ్మ అని పేరు వచ్చింది. ఒకప్పుడు ఒడిశాలోని కోరాపుట్ జిల్లా, నందపురం అనే ప్రాంతం కళింగ దేశంలో ఓ రాజ్యంగా ఉండేది. ఆనందపురాన్ని రాణి మాకలశక్తి, ఆమె భర్త భైరవుడు పాలించేవారు. వీరికి ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆ సంతానంలో మొదటి అమ్మాయే మోదకొండమ్మ. చిన్నతనం నుంచీ తన మహిమల్ని చాటిన మోదకొండమ్మ మహిషాసురుణ్ణి సంహరించే క్రమంలో ఆదిపరాశక్తికి సహాయపడిందనీ పురాణాలు చెబుతున్నాయి. పూర్వం పాడేరు మండలం మోదాపల్లి అనే గ్రామంలో అడవిలో ఓ రాయి కింద అమ్మవారు పూజలు అందుకునే వారట. కీకారణ్యంలో ఉన్న అమ్మవారిని గిరిజనులు ఆరాధించేవారు. పూజలు చేసేవారు. ఆ తల్లే తమను రక్షిస్తుందని గిరిజనులు విశ్వశించి ఆరాధిస్తు. నైవేద్యాలు సమర్పించేవారు. అయితే.. ఓరోజు అమ్మవారు కోలువుదిరిన ప్రాంతంలో పూజలు చేసి వెళ్తూ ఓ గిరిజనుడు తనతో తెచ్చుకున్న చెంబును మర్చిపోయాడట. దారి మధ్యలో గుర్తుకురావడంతో ఆ చెంబు కోసమని అమ్మవారు కొలువైన రాతిగుహ దగ్గరికి వెళ్లాడు అట. ఆ సమయంలో అమ్మవారు తన చెల్లెల్లు, సోదరుడు పోతురాజుతో కలిసి అమ్మవారికి భక్తులు సమర్పించిన నైవేద్యాలు భుజిస్తున్నారట..! అదే సమయం లో ఆ వ్యక్తి రావడంతో ఆగ్రహించిన అమ్మవారు ఆ చెంబును కాలితో తన్నారు. అది ఎక్కడైతే పడుతుందో అక్కడే పూజలు నిర్వహించాలని అమ్మవారు అన్నారు అట. అప్పటి నుంచి ఆ చెంబు పడిన ప్రాంతంలో పూజలు చేసేవారు. అయితే.. ఘాట్రోడ్డు నిర్మాణం లో భాగంగా పాడేరు నుండి వైజాగ్ వచ్చే దారిలో అమ్మవారి పాదాలు ప్రత్యక్షం కావడంతో అప్పటినుండి అక్కడే పూజలు, జాతర నిర్వహించేవారు. పాడేరుకి పది కిలోమీటర్ల దూరం ఉండడంతో భక్తులు కాస్త ఇబ్బంది పడేవారు. అప్పటి తహసీల్దార్ దాసరి శర్మ కలలో అమ్మవారు కనిపించి ఆలయం నిర్మించాలని కోరారు అట దాంతో 1983 నుండి ఆలయ నిర్మాణం మొదలుపెట్టారు. 1985 మే 12 తేదీన ఆలయం పూర్తయింది. అప్పటి నుండి పాడేరులో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు.శక్తిస్వరూపిణి.. మన్యం దేవత మోదకొండమ్మ ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి.ఈ ఉత్సవాలకు సుమారు 25 లక్షల మంది వరకూ భక్తులు తరలివస్తారు.అందుకు తగ్గినట్టుగానే ఆలయ కమిటీ ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తాది.
ఎన్.సీతారామయ్య
9440972048