దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్
ప్రాణ త్యాగాన్ని కొనియాడిన చంద్రబాబు, లోకేశ్, జగన్
జయజయహే : జమ్మూకశ్మీర్లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యారు. వీర జవాన్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా. మే 10 శనివారం వీరజవాన్ పార్థివదేహం స్వగ్రామానికి చేరుకోనుంది. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని పోస్ట్ పెట్టారు. మురళి నాయక్ కుటుంబ సభ్యులకు నేరుగా కాల్ చేసి వారికి ధైర్యం చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఆధైర్య పడొద్దు, మీకు అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు చంద్రబాబు. వీరజనావ్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి సవిత. ఆ కుటుంబానికి 5 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. ఆ తల్లి కన్నీళ్లు చూసి భోవోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు సవిత. గోరంట్ల ప్రధాన సర్కిల్లో వీర జవాన్ విగ్రహానికి ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి సవిత. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేశారు..పాక్ సైనికులకు కానీ, పాక్ పౌరులపై కానీ ఎలాంటి దాడి చేయలేదు. ఉగ్రవాదులకు తమకు సంబంధం లేదన్న పాకిస్తాన్ వక్రబుద్ధిని బయటపెట్టింది. ఉగ్రమూకపై భారత్ దాడి చేస్తే…తిరిగి వంకరబుద్ధి చూపిస్తూ భారత సరిహద్దు ప్రాంతాలపై క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్లో పాక్ జరిపిన దాడుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు. మృతిచెందిన జవాన్ను సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్గా గుర్తించారు. మే 08 గురువారం రాత్రి సరిహద్దు వెంబడి పాక్ కాల్పులు జరపగా మన సైన్యం కూడా దీటుగానే బదులిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో మురళీ నాయక్ చనిపోయినట్టు సమాచారం. మే 10 శనివారం స్వగ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం రానుంది. వీర జవాన్ మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెరువుతండాలో పెరిగారు. సోమందేపల్లి విజ్ఞాన్ స్కూల్లో విద్యాభ్యాసం సాగింది. వీర జవాన్ మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో ఉంది.
లోకేష్ ట్వీట్ చేశారు..
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన మురళి నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తాం. మురళి నాయక్ 2023లో భారత ఆర్మీలో విధుల్లోకి హాజరయ్యారు. చిన్నప్పటి నుంచి జవాన్ అవుతా అనేవాడని..అనుకున్నట్టే సైనికుడిగా విధుల్లో చేరాడని స్థానికులు ఏబీపీ దేశంతో చెప్పారు. మురళీనాయక్ తల్లిదండ్రులైన శ్రీరాం నాయక్, జ్యోతీ బాయి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మురళీనాయక్ ఒక్కడే సంతానం కావడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేదు.