ఇక వన్డేలకు మాత్రమే పరిమితం
టీ 20లకు గతేడాదే వీడ్కోలు
జయజయహే : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్ల్లో రోహిత్ కనబడడు. కేవలం వన్డే మ్యాచ్ల్లో మాత్రమే రోహిత్ టీమిండియా తరఫున ఆడతాడు. గతేడాది టీ-20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టీ-20 లకు కూడా రోహిత్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 67 టెస్ట్ మ్యాచ్లు ఆడిన రోహిత్ 4301 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలిపాడు. కాగా, రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా రెండు సార్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పైనల్కు చేరింది. అయితే ఇటీవలి కాలంలో రోహిత్ టెస్ట్ క్రికెట్లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. టెస్ట్ మ్యాచ్ల్లో అతడి కెప్టెన్సీ కూడా ఆశించిన స్థాయిలో లేదు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా గత ఆరు మ్యాచ్ల్లో ఐదింట్లో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ల్లో ఓటమి పాలైంది. అలాగే వ్యక్తిగతంగా కూడా రోహిత్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో సిడ్నీ టెస్ట్ నుంచి స్వయంగా తప్పుకున్నాడు. త్వరలో టీమిండియా టెస్ట్, వన్డే సిరీస్ల కోసం ఇంగ్లండ్ వెళ్లబోతోంది. ఈ నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్కు ఇవ్వకూడదని అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారులకు అగార్కర్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ ఏకంగా తన టెస్ట్ కెరీర్కే ఫుల్స్టాప్ పెట్టేశాడు. మరి, రోహిత్ రిటైర్మెంట్తో టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరనే ఆసక్తి నెలకొంది. జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ టీమిండియా టెస్ట్ కెప్టెన్ రేసులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.