భీమిలి: జయజయహే : భీమిలి నియోజకవర్గంలో ప్రధాన రోడ్లను. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు – వి.ఎం.ఆర్.డి.ఎ. చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ తో కలిసి బుధవారం సందర్శించారు. పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని వి.ఎం.ఆర్.డి.ఎ. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఏ రోడ్లు ఎంత వెడల్పు విస్తరించాలి.. ఎక్కడెక్కడ ఎలైన్మెంట్లను మార్చాలి.. అన్నది పరిశీలించారు. భీమిలి బీచ్ రోడ్డు, పాత అడవివరం, సత్తరువు, ఆనందపురం, పెద్దిపాలెం, దొరతోట, నేరళ్లవలస జంక్షన్ లలో పర్యటించిన ఎమ్మెల్యే ఆయా జంక్షన్ లలో రద్దీకి తగ్గట్టు మెరుగైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ది చెందుతున్న ఈ ప్రాంతాల్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు వెడల్పు, ఎలైన్మెంట్ డిజైన్ చేయాలని సూచించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చే నాటికి ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా రోడ్ల నిర్మాణం జరగాలన్నారు. వి.ఎం.ఆర్.డి.ఎ. జాయింట్ కమిషనర్ కె.రమేష్, ఎస్టేట్ ఆఫీసర్ దయానిధి, చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప, కూటమి నాయకులు పాల్గొన్నారు.