మాడుగుల : జయజయహే : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం మాడుగుల ప్రాంతం ఇలవేల్పు శ్రీ మాడుగుల మాలకొండ అమ్మవారి నెలరోజుల జాతర కొలువు మంగళవారం ప్రారంభమైంది. జూన్ మూడవ తేదీన అమ్మవారి జాతర జరగనున్న నేపథ్యంలో నెలరోజులు ముందుగా మాడుగుల కోటబైల ఆవరణలో గల సంతకం పట్టు వద్ద కొలువు ఏర్పాటు చేయడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. దానిలో భాగంగా ఈ నెల నాలుగో తేదీన పండగ చాటింపు వేశారు. మంగళవారం ఉదయం 9 గంటలకు అమ్మవారి ఆలయం నుంచి ఘటాలు పాదాలు ప్రతిమను వాయిద్యాలతో, మందు గుండు సామాగ్రితో ఊరేగింపుగా తీసుకువచ్చి శతకం పట్టులో కొలువుంచారు. ఈ నెలరోజుల పాటు అమ్మవారుని భక్తులు గ్రామస్తులు శతకం పట్టు వద్దే దర్శించుకుంటారు.ఈ సందర్భంగా దారి పొడవునా అనేకమంది మహిళలు పసుపు నీళ్లను పాదాలపై వేసి అభిషేకించుకున్నారు. అనంతరం శతకం పట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందలాదిగా గ్రామస్తులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు పుప్పాల అప్పలరాజు, సభ్యులు ఎస్ శ్రీనివాసరావు, దంగేటి సూర్యారావు, భీమరశెట్టి పైడయ్య నాయుడు , ఎంపీపీ రాజారాం, గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి, ఉపసర్పంచ్ జే వరహాలు, మాజీ ఎంపీపీ రామధర్మజ, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.