శాస్వత రాజధానిగా అమరావతి
రైతుల త్యాగాన్ని ఎన్నటికీ మరువలేం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగం
జయజయహే : ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం త్యాగం చేసిన అమరావతి రైతులు ఐదేళ్ళలో నలిగిపోయారు, రాజధాని లేదన్న నేతలపై పోరాడి గెలిచారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని పవన్ మాటిచ్చారు. లాఠీదెబ్బలు, ముళ్లకంచెల మధ్య ఇబ్బందిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పవన్. అమరావతి రైతుల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. గత ఐదేళ్లలో సుమారు 2 వేల పైచిలుకు రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అమరావతి రైతుల త్యాగాలను గుర్తించిన మోదీ.. అమరావతి పున: ప్రారంభానికి విచ్చేశారన్నారు. ప్రజల 5 కోట్ల మందికి అమరావతి జీవనాడి అన్న పవన్.. గత ప్రభుత్వంలో అమరావవతి అంటే పరాదాలు, సెక్షన్లు గుర్తుకు వచ్చేలా చేశారన్నారు. అయితే రైతులు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. 5 కోట్ల మంది ప్రజల తరఫున రైతులు, మహిళలు, విద్యార్థులు తిన్న గాయాలు మదిలో ఉన్నాయన్నారు. అమరావతి ప్రజల త్యాగాలను మేం మర్చిపోమన్న పవన్.. మీ ఆశలకు అనుగుణంగా అమరావతి నిర్మాణం ఉంటుందన్నారు. కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోవడం యావత్ భారతదేశాన్ని కలచివేసిందన్నారు పవన్. ఇంత ఇబ్బందుల్లో కూడా ప్రధాని ఇక్కడికి రావడం ప్రజల అదృష్టం అన్నారు. అమరావతి రైతుల త్యాగాలను ప్రధాని గుర్తించారన్నారు. మోదీకి భవానీ అమ్మ ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు.