జయజయహే : సింహగిరిపై గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనలో విస్తు పోయే అంశాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఈ ఘటన పైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. విచారణ వేళ ఘటన కు కారణాల పైన కమిటీ ఆరా తీసింది. కూలిన గోడ నిర్మాణంలో నాణ్యత లేదని గుర్తించారు. నాలుగు రోజుల కిందటే గోడ నిర్మాణం పూర్తి చేసారు. పునాది లేకుండానే నాసిరకంగా పనులు చేసారు. ఆలయ వైదిక కమిటీ వారించినా గోడ నిర్మాణం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందనే వాదన వినిపిస్తోంది.
విచారణ మొదలు సింహాచలంలో గోడ కూలి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన వెనుక నిర్లక్ష్యం వెలుగులోకి వస్తోంది. గోడ నిర్మాణంలో ఏ మాత్రం నాణ్యత పాటించలేదని గుర్తించారు. ఒక్కసారిగా కుప్పకూలి న రిటైనింగ్ వాల్ కారణంగా సిమెంటు ఇటుకలు, మట్టి కింద నలిగిన భక్తులు ప్రాణాలు కోల్పోయి నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆలయంలో 2.30 గంటలకు ఈదురుగాలులతో అరగంటపాటు భారీ వర్షం కురిసింది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన పందిళ్లు కొన్ని కూలిపోయాయి. కరెంటు కూడా పోయింది. భక్తుల కోసం కొత్త షాపింగ్ కాంప్లెక్స్ పక్క నుంచి రూ.300 దర్శన వరుస ఏర్పాటు చేశారు. వర్షం పడితే కొండ పైనుంచి షాపింగ్ మాల్ వరకు వాన నీరు వస్తుండటంతో… ఇటీవలే అక్కడ రిటైనింగ్ వాల్ నిర్మించారు. కేంద్రప్రభుత్వ నిధులతో ‘ప్రసాద్’ పథకం కింద చేపట్టిన ఈ గోడ నిర్మాణం నాలుగు రోజుల క్రితమే పూర్తయింది. బలమైన పునాదులు లేకుండా, సిమెంట్ ఇటుకలతో నిర్మించారు. సరిగ్గా క్యూరింగ్ కూడా కాలేదు. భారీవర్షానికి కొండ పైనుంచి నీరు ప్రవహించడంతో… ఆ ఒత్తిడికి గోడ కింద మట్టి కోసుకుపోయింది. తెల్లవారుజామున 3గంటలకు గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దాన్ని ఆనుకునే ఏర్పాటు చేసిన రూ.300 దర్శనం భక్తులపైకి సిమెంట్ ఇటుకలు పిడుగుల్లా పడ్డాయి. మట్టి కూడా ముంచెత్తింది. చిమ్మ చీకటి… వర్షం… అంతలోనే భారీ శబ్దం… కేకలుతో ఆ చీకటిలో ఏం జరుగుతుందో తెలిసే లోగానే పలువురు ప్రాణాలు కోల్పోయారు. అంబులెన్స్.. సహాయక సిబ్బంది చేరుకునే సరికే అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే, ఈ టూరిజంలో డిప్యుటేషన్ పైన పని చేస్తున్న ఒక ఇంజనీర్ నిర్లక్ష్యం ఇక్కడ గుర్తించారు.
సెలవు పైన ఈవో
చందనోత్సవం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సమయంలో ఈవో సెలవు పైన వెళ్లటం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. సింహాచలం కొండ పైన రిటైనింగ్ వాల్ వద్దని ఆలయ వైదిక సిబ్బంది అభ్యంతరం చెప్పారు. అయినా, ప్రణాళిక శాఖ తమ నిర్ణయాల మేరకు ముందుకు వెళ్తామంటూ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టింది. ఆఘమేఘాల పై గోడ నిర్మాణం చేసింది. ఏ మాత్రం నాణ్యత లేకుండా నాసిరకంగా నిర్మాణం పూర్తి చేసింది. కాంక్రీట్ తో కాకుండా సిమెంట్ ఇటుకలతో ఈ నిర్మాణం చేపట్టారు. ఫలితంగా భక్తుల రద్దీ.. జోరు వాన వేళ ఈ గోడ కూలి పోయింది. దీంతో, ఇప్పుడు విచారణ చేస్తున్న కమిటీ ఈ కోణంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్దం అవుతోంది. బాధ్యుల పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి.