వియాత్నంలో కీలక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం
జయజయహే : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు అరుదైన గౌరవం లభించింది. వియత్నాంలో జరిగే బుద్ద భగవానుని అవశేషాల ప్రదర్శన కార్యక్రమ బాధ్యతను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు, మంత్రి కందుల దుర్గేష్కు అప్పగిస్తూ పీఎంవో మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. వియత్నాం ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం బుద్దుడి పవిత్ర అస్థికలు, అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలోని హో చి మిన్హ్ నగరంలో ప్రదర్శించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో దేశంలోని బుద్ధుడి పవిత్ర అవశేషాలను (కపిల్వాస్తు అవశేషాలు) పటిష్ట భద్రత నడుమ భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్-ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్) చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్లో కేంద్రం పంపించనుంది. బౌద్ధ మత అనుచరులు ఎంతో పవిత్రంగా భావించే బుద్ధ భగవానుడి అవశేషాలను మే1 న న్యూఢిల్లీ నుంచి వియత్నాంలో ప్రదర్శనకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 6 వరకు వియత్నాంలో ప్రదర్శన జరుగనుంది. ఈ ప్రదర్శనలో బుద్ధ భగవానుడి అవశేషాలను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శన పూర్తి అయిన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ తిరిగి రాష్ట్రానికి తిరిగి రానున్నారు. ఈ ప్రదర్శనతో వియత్నాం, భారతదేశ బౌద్ధ సమాజాలు, ప్రజల మధ్య దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. వియాత్నం వెళ్లేందుకు ఏప్రిల్ 30న మంత్రి కందుల దుర్గేష్ న్యూఢిల్లీ చేరుకోనున్నారు. మంత్రి కందుల దుర్గేష్కు లభించిన ప్రత్యేక గౌరవంపై ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. తనకు లభించిన అవకాశంపై మంత్రి దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు