మానవ నాగరికత అభివృద్ధిలో కార్మికుల పాత్ర అత్యంత ప్రాధాన్యమైనది. వారి శ్రమ, పట్టుదల, అంకితభావమే సమాజ అభివృద్ధికి మూలస్తంభం. ఈ క్రమంలో కార్మిక హక్కుల సాధనకు చారిత్రాత్మకంగా రూపుదిద్దుకున్న ప్రత్యేక దినం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే)
మేడే చరిత్ర – పోరాటం నుండి గౌరవం దాకా
1870 దశకానికి ముందు వరకూ కార్మికులు రోజుకు 12-16 గంటలు పనిచేయడం సర్వసాధారణంగా వుండేది. తక్కువ వేతనం, హింసాత్మక పరిస్థితులు, అసమానతలు వారి జీవన విధానంగా సాగేవి ఈ అన్యాయ పరిస్థితులను ఎదిరిస్తూ 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు అతి పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. “ఎనిమిది గంటల పని దినం” కోసం వారు పోరాటం చేశారు . ఈ ఉద్యమంలో పలువురు కార్మికులు సైతం ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలకు గుర్తుగా,1889లో పారిస్లోని రెండో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో మే 1ను అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు. ఆ నాటి ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల నైతిక , ప్రాథమిక హక్కులను మేల్కొలిపింది. ప్రపంచ చరిత్రలో మేడే ఒక మైలురాయిగా నిలించింది
మేడే లక్ష్యం – శ్రమకు గౌరవం, కార్మికుల హక్కులకు రక్షణ
మేడే రోజున ప్రపంచం మొత్తం శ్రమ విలువను గుర్తించి, కార్మికుల హక్కులను చాటి చెప్పుతుంది.
ఈ దినోత్సవం యొక్క ప్రధాన సందేశాలు:
కార్మిక హక్కుల పరిరక్షణ: అన్యాయ నియామకాలను అడ్డుకోవడం.
సురక్షితమైన పని ప్రదేశాలు వాతావరణం : ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టడం.
సముచిత వేతనాలు :కనీస జీవన ప్రమాణాలకు సరిపడే జీతాలు నిర్ధారించడం.
ఆరోగ్య సంరక్షణ : కార్మికుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం.
కార్మిక ఐక్యత :సంఘటిత శక్తిగా మారి హక్కుల కోసం పోరాడటం
భారతదేశంలో మేడే ప్రస్థానం
భారతదేశంలో మేడే చరిత్ర 1923 మే 1న మొదలైంది. కార్మిక నాయకుడు సింగరవేలు నాయకత్వంలో చెన్నై (మద్రాస్)లో మేడే ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. అప్పటి నుండి మేడే భారతదేశ కార్మిక చరిత్రలో కీలక ఘట్టంగా మారింది. భారత కార్మిక చట్టాలు- కార్మికుల రక్షణకు మార్గదర్శకాలు. భారతదేశం కార్మిక హక్కులను బలోపేతం చేయడానికి అనేక చట్టాలను అమలు చేసింది. కనీస వేతన చట్టం (1948) — కార్మికులకు కనీస వేతన హామీ.
శ్రమ జీవన చట్టం (1972) — కార్మికుల జీవన ప్రమాణాల మెరుగుదల. పని గంటల చట్టం — 8 గంటల పని శ్రమకు సరిహద్దులు విధించడం. కార్మిక సంక్షేమ పథకాలు — భీమా, పెన్షన్, ఆరోగ్య రక్షణ వంటివి. ఈ చట్టాల ద్వారానే కార్మికులు తమ హక్కులను అమలు చేయగలుగుతున్నారు.
నేటి మేడే – కొత్త సవాళ్ళ
గ్లోబలైజేషన్, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( ఏ ఐ ) తదితర పరిణామాలతో కార్మిక రంగం విస్తృతమైన మార్పులకు లోనవుతోంది. ఆటోమేషన్ వల్ల మానవ శ్రమను మిషన్లు భర్తీ చేస్తున్నాయి. ఐటీ, సర్వీస్ రంగాల్లో కార్మికులకు ఒత్తిడి పెరిగింది వీటితో పాటు ఔట్ సోర్సింగ్ వంటి వాటి వలన శ్రమ దోపిడి జరిగి పని గంటలు పెరిగాయి
కార్మిక సంఘాలు బలహీనపడటంతో హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అసంఘటిత రంగాలలో (అట్టడుగు కార్మికులు, గృహ సహాయకులు, నిర్మాణ కార్మికులు) శోషణ ఇంకా కొనసాగుతోంది. ఈ నూతన యుగంలో, మేడే సాధించిన గౌరవాన్ని నూతన అవసరాలకు అనుగుణంగా పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉంది. శ్రమకు గౌరవం, జీవన న్యాయం కోసం నూతన పోరాటాలు అవసరమయ్యాయి.
శ్రమకు సన్మానం – సమాజ అభివృద్ధికి సంకేతం
సమాజంలో మేధా సంపతి, సాంకేతికత ఎంత పెరిగినా చివరికి నిలబడి ఉండేది శ్రమపై మాత్రమే. చివరికి నేలపై ఒక బరువైన ఇటుక మోసే కార్మికుడి చెమటే నగరాల నిర్మాణానికి మూలాధారం,కార్మికుల శ్రమను గౌరవించడం, వారి హక్కులను పరిరక్షించడం మనందరి బాధ్యత.
ఈ మేడే...
శ్రమజీవుల గౌరవానికి పునాదిని వేయాలి. కార్మికులకు సముచిత జీవన ప్రమాణాలు నిర్ధారించాలి. సమాజాన్ని సమానత్వం దిశగా నడిపించాలి. శ్రమ నీ ఆయుధం అయితే, గెలుపు నీ గమ్యం అవుతుంది. శ్రమించిన చేతులకు గౌరవం ఇవ్వడం మనుషులుగా మనందరి బాధ్యత.
జి. అజయ్ కుమార్
కాలామిస్ట్