జయజయహే : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడుతుండడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటివరకు టీడీపీ-జనసేన మధ్య స్థానిక స్థాయిలో కొన్ని విభేదాలు నమోదవ్వగా.. ఇప్పుడు బీజేపీ నేతలతో కూడా టీడీపీ నేతల మద్య కలహాలు తెరపైకి వచ్చాయి. బహిరంగంగా కార్యకర్తల ముందే.. మీడియా సాక్షిగా ఇరు పార్టీలకు చెందిన నేతలు మాటల యుద్దానికి దిగడం కూటమిలో కలవరం పుట్టిస్తోంది. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు… బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బహిరంగ వేదికపైనే ఘర్షణకు దిగారు. గంటా కారులో కూర్చొని సీరియస్ గా మాట్లాడుతుంటే.. విష్ణు కుమార్ రాజు కారు పక్కనే నిలబడి సమాధానం చెబుతూ ఉన్నారు. ఈ తతంగం అంతా మీడియా కంటికి చిక్కడం, పలువురు సోషల్ మీడియాలో సైతం షేర్ చేయడంతో ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది అంటే..
గంటా శ్రీనివాసరావు ఫైర్ అవుతూ.. “నా నియోజకవర్గమైన భీమిలిలో నాకు తెలియకుండా ఫిలిం నగర్ క్లబ్ లీజ్ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడమేమిటి? ఇలా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే సహించేది లేదు” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే అందుకు విష్ణు కుమార్ రాజు స్పందిస్తూ.. “మీరు అందుబాటులో లేరు కాబట్టి కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇచ్చాం” అంటూ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం వినకుండా కేకలు వేస్తూ వాహనంలో కూర్చొని మరింత ఆగ్రహంతో స్పందించారు. ఈ క్రమంలో తోటి నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. గంటా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.