మధురవాడ జయజయహే : రుషికొండ ఐటి హిల్ నెంబర్ 3 వద్ద నిర్మించనున్న మెగా హౌసింగ్ ప్రాజెక్టు ఐకానికా సిటి ఆఫ్ గోల్డ్ కు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి గురువారం శంకుస్థాపన చేసి, బ్రోచర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 97 ఎకరాల సువిశాలమైన ఈ ప్రాజెక్టు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్.సి.సి. సంస్థ అనుభవజ్ఞులైన ఐకానికా రియల్ ఎస్టేట్ కంపెనీతో కలిసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొత్తగా రానున్న టీసీఎస్, గూగుల్ వంటి దిగ్గజ ఐటి కంపెనీలు, టూరిజం, ఫార్మా ప్రాజెక్టుల వల్ల విశాఖలో నిర్మాణ రంగం ఊపందుకుంటుందని చెప్పారు. మై హోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ గోవాను మించిన సముద్ర అందాలున్న విశాఖ రియల్ ఎస్టేట్ గమ్య స్థానమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐకానికా ప్రాజెక్ట్ చైర్మన్ కొట్టు మురళి మాట్లాడుతూ బెంగళూరు, హైదరాబాద్ లలో వేల సంఖ్యలో ఫ్లాట్లు, విల్లాలు నిర్మించామని వివరించారు. కార్యక్రమంలో ఐకానికా ప్రాజెక్ట్స్ ఎండీ కె.ఎల్. సంతోష్, అల్లూరి రంగరాజు, అల్లూరి సీతారామరాజు, వేణు, కార్పొరేటర్ లొడగల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.