తిరుమలలో భద్రతా లోపాల పై కేంద్రం ఆరా తీసింది. కొంత కాలంగా చోటు చేసుకుం టున్న వరుస పరిణామాల పైన స్పందించాలని సూచించింది. తిరుమలలో భద్రతా వైఫల్యాల పైన తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్రానికి ఫిర్యాదు చేసారు. తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన కేంద్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఈ ఫిర్యాదుల పైన పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. తిరుమలలో భద్రత పైన ఎంపీ చేసిన ఫిర్యాదు..తీసుకుంటున్న చర్యల పైన నివేదిక ఇవ్వాలని అందులో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.కేంద్రం జోక్యం కోరుతూ తిరుమలలో వరుసగా జరుగుతున్న భద్రత వైఫల్యాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ.. ప్రధానమంత్రి, హోం మంత్రి, హోంశాఖ కార్యదర్శికి వైయస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ”వైకుంఠ ఏకాదశి రోజున ఆరుగురు భక్తులు తొక్కిసలాటలో చనిపోయారు. అన్నదానం క్యూ కాంప్లెక్స్లో భక్తులను నియంత్రించలేక తొక్కిసలాట జరిగింది. నాన్ వెజ్ పదార్థాలను కొండ పైకి తీసుకెళ్లి తిన్న ఘటనలు జరిగాయి” అని లేఖలో ఆయన పేర్కొన్నారు.”మద్యం, గంజాయి మత్తులో ఓ వ్యక్తి.. సులభంగా అలిపిరి చెక్ పాయింట్ను దాటుకొని వెళ్లి భక్తులను గాయపరిచారు. పవిత్రమైన పాప వినాశనం డ్యామ్లో నిబంధనలకు విరుద్ధంగా బోట్లను తిప్పారు. మార్చి 31న మతిస్థిమితం లేని వ్యక్తి బైక్ పై తిరుమల కొండపైకి చేరుకున్న విషయాన్ని లేఖలో వివరించారు.
అస్తవ్యస్తంగా టీటీడీ పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. దానివల్లే సమన్వయ లోపం, భద్రత లోపం తలెత్తిందని ఎంపీ పేర్కొన్నారు. తిరుమల జాతీయ ప్రాధాన్యత కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రం. వరుసగా జరుగుతున్న భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. భక్తుల రక్షణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను మెరుగుపర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, కాని రెడ్ బుక్ రాజ్యాంగంపై దృష్టి సారించిన ప్రభుత్వం పాలనపై పట్టు కోల్పోయిందని పేర్కొన్నారు.తిరుమలలో భద్రతా లోపాలు భక్తుల జీవితాలను ప్రమాదంలో పడేయడంతో పాటు, వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పవిత్రతను తీవ్రంగా దెబ్బతీశాయని తెలిపారు. ప్రస్తుత టీటీడీ పాలక మండలి భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. దీని పైన స్పందించిన కేంద్రం ఇప్పుడు సీఎస్ కు లేఖ రాసింది.