జయజయహే : తారకరామా తీర్థసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులను మరియు ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుంకరి రమణమూర్తి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కు విజ్ఞప్తి చేశారు. ఈరోజు తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కు సాదర స్వాగతం చెబుతూ, ముందుగా ఈ ప్రాంత రైతులను ఆదుకోవడానికి సరైన ప్రణాళికతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన దక్షతతో సీనియర్ శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు లాంటి రైతు సంక్షేమ వాదుల సూచనలతో రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడం, ప్రతి ఎకరాకు సాగునీటినందించే ధ్యేయంతో ముందుకెళ్లడం హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ, ఈ ప్రాంత రైతులు పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఈ ప్రాంత రైతుల సమస్యను వివరిస్తూ, తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన భూ సేకరణ లో భూములు కోల్పోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, విలువ గల భూములను అప్పట్లో తక్కువ నష్టపరిహారానికి ఇచ్చి, భూములు కోల్పోయిన రైతులు ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నారని, వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈ ప్రాంత రైతుల భూములను తీసుకొని ప్రాజెక్టును నిర్మించినప్పటికీ ప్రాజెక్టు వలన ఈ ప్రాంత రైతులకు ఎటువంటి ఉపయోగం లేదని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమార్గం ఈ ప్రాంత వాసులకు కూడా సాగునీరు తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందించేటట్టు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గత వైకాపా ప్రభుత్వం తారకరామ తీర్థసాగర్ ను అభివృద్ధి పరచడంలో విఫలమైందని ఈ ప్రాంత రైతులను మోసం చేసిందని విమర్శిస్తూ, కనీసం ఈ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పర్యాటకుల భద్రత నిమిత్తం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వలన 2023 -24 సంవత్సరంలో ముగ్గురు పర్యాటకులు దుర్మరణం పాలయ్యారని, ఇప్పటికైనా భద్రత నిమిత్తం ముందస్తు చర్యలు చేపట్టి, రెయిలింగ్స్, మరియు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
రైతు సమస్యలను విన్న మంత్రి రామానాయుడు స్పందిస్తూ, ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతుకి ఎటువంటి కష్టం వచ్చిన ఆదుకోవడానికి చంద్రబాబు గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొంటూ, రైతు సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు విద్యార్థి సేన నాయకులు కార్యకర్తలు విద్యార్థులు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు