విజయనగరం జయజయహే: తారకరామా తీర్ధసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గుర్ల మండలం ఆనందపురం వద్ద నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు బ్యారేజ్ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ముందుగా ప్రాజెక్టువద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను, ప్రాజెక్టు మ్యాపులను తిలకించారు. ప్రాజెక్టు ఇంజనీర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బ్యారేజ్ను పరిశీలించారు. ప్రజలనుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. విజయనగరం పట్టణాన్ని త్రాగునీరు, భోగాపురం విమానాశ్రయానికి నీటి అవసరాలను తీర్చడమే కాకుండా, సుమారు 20వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించే తారకరామ తీర్ధసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఎంతో అవసరమని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో బ్యారేజ్ పనులు 90 శాతం పూర్తయినప్పటికీ, గత ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. నిర్వహణ సైతం చేపట్టకపోవడంతో, ప్రాజెక్టు గేట్లు, ఇతర నిర్మాణాలు తుప్పుపట్టిపోయాయని తెలిపారు. ప్రాజెక్టు డైవర్షన్ కెనాల్ 60శాతం, సొరంగం పనులు 20 శాతం పూర్తి అయ్యాయని చెప్పారు. సుమారు 2.7 టిఎంసిల నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్ మట్టిగట్టు నిర్మాణ పనులు 60శాతం మేరకు పూర్తి అయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే ఆర్ అండ్ ఆర్ క్రింద దాదాపు రూ.175 కోట్లు పెండింగ్ ఉందని, దానిని చెల్లిస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉత్తరాంధ్రలో పెండింగ్లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి, వాటిని పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్ ఉండే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి సుమారు రూ.807 కోట్లు అవసరమని అంచనా వేశామని, ఆలస్యం అయితే ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని, అయినప్పటికీ నిధులను సమీకరించి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఒక్క నీటిపారుదల శాఖకు సంబంధించే సుమారు 18,000 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఒకవైపు బకాయిలు తీరుస్తూ, అప్పులకు వడ్డీలు కడుతూ, రాష్ట్రంలో అభివృద్దిని కొనసాగించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. తారకరామా తీర్ధసాగర్ ప్రాజెక్టు కోసం మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు చేసిన కృషిని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు.
ఈ పర్యటనలో నెల్లిమర్ల, రాజాం ఎంఎల్ఏలు లోకం నాగమాధవి, కోండ్రు మురళీమోహన్, మార్కెఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, తారకరామ తీర్ధసాగర్ ఎస్ఈ స్వర్ణకుమార్, ఆర్డిఓలు సత్యవాణి, డి.కీర్తి, టిడిపి నాయకులు కిమిడి నాగార్జున, కిమిడి రామ్ మల్లిక్ నాయుడు, ప్రాజెక్టు డిఈలు, ఏఈలు, ఇతర అధికారులు, కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.